పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రేపు ఇస్లామాబాద్‌లో నిర్వహించే బహిరంగ ర్యాలీలో తన రాజీనామా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ముందస్తు ఎన్నికలను ప్రకటించి ఆపద్ధర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిసింది. అక్రమ సొమ్ము ఫండింగ్‌గా పుచ్చుకున్నారనే ఆరోపణలతో ఆయనను సోమవారం పోలీసులు అరెస్టు చేయనున్నట్టు సమాచారం ఉన్న తరుణంలో రేపు ఆయన ప్రకటించే నిర్ణయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ రేపు దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ ర్యాలీలో రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. అక్రమ విదేశీ విరాళాలు పొందారన్న ఆరోపణలపై ఆయనను సోమవారం అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి ఒక రోజు ముందు ఆయన ర్యాలీలో ప్రసంగించనున్నారు. పాక్ ప్రధానిపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రేపటి బహిరంగ ర్యాలీలో తన రాజీనామా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అందింది. అయితే, అదే సందర్భంలో ముందస్తు ఎన్నికలను ప్రకటించి ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడిపే అవకాశాలు ఉన్నాయి.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ ఆర్మీ కూడా విశ్వాసాన్ని వదులుకుంది. సోషల్ మీడియా క్యాంపెయిన్ ద్వారా ఆర్మీని విభజించాలని ఆయన ప్రయత్నాలు చేశారని ఆర్మీ గర్రుగా ఉన్నది. అంతేకాదు, ఆర్మీ చీఫ్ జనరల్ ఖామర్ జావేద్ బజ్వా పదవీ కాలాన్ని 2019లో పొడిగించడానికి ఆయన కావాలనే తాత్సారం చేశారనే కోపమూ ఉన్నది. ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షాలు ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధం అయ్యాయి. ఈ తీర్మానానికి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. అంతేకాదు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకే చెందిన కనీసం రెండు డజన్ల చట్టసభ్యులు ఆయనపై తీవ్ర వ్యతిరకతతో ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి ఓటు వేస్తామని స్పష్టంగా ప్రకటించి ఉన్నారు.

దేశంలో ఆర్థిక సంక్షోభానికి, ధరల పతనానికి కారణంగా ఇమ్రాన్ ఖాన్ కారణం అని పేర్కొంటూ పీఎంఎల్ ఎన్, పీపీపీ పార్టీలకు చెందిన సుమారు 100 మంది చట్టసభ్యులు ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సభాధ్యక్షుడికి వినతి చేశారు. 342 సభ్యుల నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిలవాలంటే కనీసం 172 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ, ఖాన్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన మూడు మిత్ర పార్టీలూ ఆయనకు వ్యతిరేకంగా ఓటేస్తామన్నట్టుగా ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. కాగా, కనీసం 24 మంది పీటీఐ సభ్యులు ఇప్పటికే తిరుగుబాటును ప్రకటించారు.

ఈ అవిశ్వాస తీర్మానాన్ని శుక్రవారం ప్రవేశపెట్టాల్సి ఉండింది. కానీ, దాన్ని ప్రవేశపెట్టకుండానే సభను వాయిదా వేశారు. ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఫిబ్రవరి 14న మరణించిన ఓ చట్ట సభ్యునికి నివాళిగా మార్చి 28వ తేదీ వరకు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ అసద్ కైసర్ ప్రకటించారు. అదే సందర్భంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే కనీసం మూడు నుంచి ఏడు రోజులపాటు దానిపై చర్చించి ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుందని, అది ఇప్పుడు సాధ్యపడదని పేర్కొన్నారు. కాబట్టి, వచ్చే సెషన్‌లోనే ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుందని వివరించారు.

కాగా, విదేశాల నుంచి నిషేధిత చోట్ల నుంచి పీటీఐకి ఫండింగ్ వచ్చిందని, అక్రమ సొమ్ము వచ్చి చేరిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌కు దీనికి సబంధించిన రిపోర్టు సమర్పించారు. ఈ వ్యవహారం కూడా తీవ్రరూపం దాల్చింది. ఈ అక్రమ సొమ్ముకు సంబంధించిన కేసులో సోమవారం ఇమ్రాన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.