పాకిస్థాన్ లో చీకటి శకం ముగిసిందని, ఇప్పుడంతా కోలుకునే సమయమని పీఎంఎల్-ఎన్ వైస్ ప్రెసిడెంట్ మర్యమ్ నవాజ్ షరీఫ్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి వైదొలగడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోందని తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ప్రతిపక్షాలు జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. ఈ పరిణామంపై పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్-ఎన్) వైస్ ప్రెసిడెంట్ మర్యమ్ నవాజ్ షరీఫ్ ఆదివారం ఉపశమనం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ పీడకల ముగిసిందని అన్నారు. ఇక ఇది కోలుకునే సమయం అని తెలిపారు.
పాకిస్థాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ‘‘ నా ప్రియమైన పాకిస్తాన్కు పీడకల ముగిసింది. ఇది నయమయ్యే సమయం’’ అని పేర్కొన్నారు. అనంతరం పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ తొలగింపుపై స్పందిస్తూ.. పాకిస్తాన్ చరిత్రలో చీకటి అధ్యాయం ముగిసిందని తెలిపారు. ‘‘ పాకిస్థాన్ చరిత్రలో చీకటి కాలం ముగిసింది. మేము సర్వశక్తిమంతుడి ముందు మా తలలు వంచి, ఈ వ్యక్తి (ఇమ్రాన్ ఖాన్) మా మాతృ భూమికి కలిగించిన నష్టాన్ని సరిచేసే కష్టమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ సమయంలో మేము మార్గదర్శనం కోసం, విజయం చేకూర్చాలని ప్రార్థిస్తున్నాము ’’ అని ఆమె ట్వీట్ చేశారు.
పాకిస్థాన్ సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఓటింగ్ను పూర్తి చేయాలంటూ ప్రతిపక్షాలు బలంగా డిమాండ్ చేయడంతో నేషనల్ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పడిన నాటకీయ పరిణామాల తర్వాత అర్థరాత్రి జరిగిన ఓటింగ్లో ఇమ్రాన్ ఖాన్ ఓడిపోయారు. ఆయన సభలో విశ్వాసాన్ని కోల్పొయారు. దీంతో ప్రధాని పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.
‘‘ ఇమ్రాన్ ఖాన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 174 మంది సభ్యులు ఓట్లు వేశారు. ఫలితంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానం జాతీయ అసెంబ్లీలో మెజారిటీతో ఆమోదం పొందింది ’’ అని సభకు అధ్యక్షత వహించిన PML-N నేత అయాజ్ సాదిక్ ప్రకటించారు. ఓటింగ్ సమయంలో అధికార పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులు హాజరు కాలేదు.
అవిశ్వాసానికి ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైజర్, డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి తమ రాజీనామాలను సమర్పించారు. దీంతో పీఎంఎల్ఎన్ నేత అయాజ్ సాదిక్ అధ్యక్షత వహించాల్సి వచ్చింది. కాగా ఇమ్రాన్ ఖాన్ గత వారం తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పార్లమెంటు దిగువ సభను రద్దు చేశారు. అయితే పాకిస్థాన్ ఉన్నత న్యాయస్థానం ఓటింగ్ నిర్వహించాల్సిందేని గురువారం ఆదేశించింది. ఈ ఓటింగ్ ను శనివారం నాటికి పూర్తి చేయాలని తీర్పునిచ్చింది.
ఇదిలా వుండగా కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఏప్రిల్ 11 (సోమవారం)న సమావేశం కానుంది. ఇందులో ఓటింగ్ జరగనుంది. నేటి (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలలోపు కొత్త ప్రధాని నామినేషన్ పత్రాలు సమర్పించే అవకాశం ఉందని, మధ్యాహ్నం 3 గంటలలోపు పరిశీలన జరుగుతుందని నేషనల్ అసెంబ్లీ ప్రిసైడింగ్ అధికారి అయాజ్ సాదిక్ను డాన్ వార్తా పత్రికకు తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేసి అప్పుడే కొత్త ప్రధానిని ఎన్నుకుంటామని చెప్పారు. కాగా ప్రస్తుతం జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ తదుపరి ప్రధానమంత్రి కాబోతున్నారు.