తాలిబాన్లు మాస్క్ పెట్టుకోవట్లేదు.. వారికి డెల్టా వేరియంట్ తెలుసా అసలు?: ఎలాన్ మస్క్
తాలిబాన్లలో ఒక్కరూ మాస్క్ పెట్టుకోవట్లేదని, వారికి అసలు డెల్టా వేరియంట్ గురించి తెలుసా? అంటూ టెస్లా సీఈవో, స్పేస్ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఆయన నిజంగానే కరోనా నిబంధనలు పాటించాలనే భావిస్తున్నాడా? అంటే భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఎలాన్ మస్క్ స్వతహాగా కొవిడియట్. కొవిడ్ నిబంధనలు పాటించడాన్ని వ్యతిరేకిస్తారు. మహమ్మారిని ఒక బోగస్ అంటూ పేర్కొన్న ఆయన కొవిడ్ నిబంధనల పాటించకుండా పలుసార్లు వివాదాస్పదంగానూ వ్యవహరించారు.
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో, స్పేస్ఎక్స్ బాస్, ట్విట్టర్పై యమ యాక్టివ్గా ఉండే ఎలాన్ మస్క్ తనదైన శైలిలో తాలిబాన్లపై స్పందించారు. ఆఫ్ఘనిస్తాన్ను అధీనంలోకి తెచ్చుకుని బీభత్సం సృష్టిస్తున్న తాలిబాన్లు మాస్క్ ఎందుకు ధరించట్లేదని సందేహించారు. ఓ ఫొటోను జతచేసిన ట్వీట్లో ఒక్కరూ మాస్క్ ధరించలేదని పేర్కొన్నారు. మరో ట్వీట్లో అసలు వారికి డెల్టా వేరియంట్ గురించి తెలుసా? అని అడిగారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట్ హల్చల్ చేస్తున్నాయి.
స్వతహాగానే నిబంధనలు పట్టించుకోని మస్క్
ఎలాన్ మస్క్ స్వయంగానే కరోనా నిబంధనలు ఖాతరు చేయని ‘కొవిడియట్’. కరోనా విలయం సృష్టిస్తుండగా అమెరికాలోని టెస్లా ఉత్పత్తి కేంద్రంలో మళ్లీ ప్రొడక్షన్ ప్రారంభిస్తామని సోమవారం ఆయన ప్రకటించారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఈ ప్రకటన చేశారు. ఎవరైనా అరెస్టు చేస్తే తానే మొదటగా అరెస్టవుతారని అన్నారు. కరోనా జాగ్రత్తలు పట్టించుకోండాకు యూనిట్ ప్రారంభించడంపై ప్రజల్లోనూ అభ్యంతరాలు వచ్చాయి. ఆయన ఇంట్లో నవజాత శిశువు ఉన్నదని, అయినప్పకీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుని అందరి ప్రాణాలు ప్రమాదంలో పెడుతున్నారని విమర్శలు చేశారు. గతంలోనూ కరోనా వైరస్ను తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. తాను నాలుగు సార్లు టెస్టు చేసుకుంటే రెండు సార్లు పాజిటివ్, రెండు సార్లు నెగెటివ్ రిపోర్టులు వచ్చాయన్నారు. కరోనా పేరిట పెద్ద బోగస్ నడుస్తూ ఉన్నదని ఆరోపణలు చేశారు.ఈ ఏడాది ఆగస్టులో బొకాచికాలోని ‘స్టార్ బేస్‘లో ఫొటో కోసం మస్క్ తన మాస్కే కాదు, కొడుకు మాస్క్ను తొలగించారు.
ప్రాణాలే మినుకు మినుకు..
ఆఫ్ఘనిస్తాన్లో ఏ క్షణంలో మృత్యువు కబలిస్తుందో తెలియని అనిశ్చిత కొనసాగుతున్నది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానాలవైపు పరుగులు తీస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ బాంబు పేలుతుందో ఏ గన్ మోగుతుందో అని ప్రజలు భీతావహ వాతావరణంలో జీవిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కరోనా వైరస్ దరిచేరవద్దని మాస్క్ ధరించే ఆలోచన ఉండటం కష్టమేనని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ప్రాణాలు ఇప్పుడే మినుకు మినుకు అన్నచందంగా ఉంటాయా? పోతాయా? అనే రణరంగంలో ముందు చూపుకు
తావెక్కడిదని అభిప్రాయపడుతున్నారు. తాలిబాన్లూ రెండు దశాబ్దాల పోరాటంలో తుదిఘట్టం చేరుకున్నారని, వారికీ కరోనా భయం లేకుండా పోయిందని పోస్టులు చేశారు. మొత్తంగా కరోనా నిబంధనలు ఖాతరు చేయని ఎలాన్ మస్క్ తాలిబాన్లు మాస్క్ ధరించాలని చెప్పడం విడ్డూరంగా ఉన్నదంటూ నెటిజన్లు పేర్కొన్నారు. అంతేకాదు, ఆయన తాలిబాన్లు మాస్క్ పెట్టుకోవాలని భావిస్తున్నారా? లేక మహమ్మారిని చిన్నదిగా చూపే ప్రయత్నమే ఆయన ట్వీట్ ఉద్దేశమా? అనే సందేహాలు వెల్లడయ్యాయి.