India Missile:  భారత క్షిపణి పాకిస్థాన్‌లో పేలిన ఘటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ చ‌ర్య‌ను అమెరికా స‌మ‌ర్థించింది. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘ‌ట‌ననే తప్ప..  కావాలని చేసిందనడానికి ఎలాంటి సూచనలు లేవని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్ అభిప్రాయపడ్డారు.  క్షిపణి ఎందుకు ఫైర్‌ అయిందో భారత్‌ ఇప్పటికే వి వరణ ఇచ్చిందనీ.. ఇంతకుమించి ఈ విష‌యంలో ఏమీ మాట్లాడలేమని తెలిపారు.  

India Missile: పాకిస్థాన్ భూభాగంలో భారత క్షిపణి పేలిన ఘటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ ఘ‌ట‌న‌పై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రెస్ స్పందించారు. భారత క్షిపణి పాక్ భూభాగంలో పడటమనేది ప్రమాదవశాత్తూ జరిగిందే తప్ప కావాలని చేసిందైతే కాద‌నీ, అది అనుకోకుండా పొరపాటుగా జరిగిన ఘటననే స్ప‌ష్టం చేశారు. అంతే తప్పా.. ఉద్దేశపూర్వకంగా చేసిన చ‌ర్య మాత్రం కాద‌నీ, ఈ ఘ‌ట‌న‌కు ఎక్కడ కూడా అలాంటి సంకేతాలు కనిపించడం లేదని నెడ్ ప్రెస్ వెల్లడించారు. భారతదేశం ఇచ్చిన వివరణలో పూర్తిగా వాస్తవమ‌నీ, ప్రమాదవశాత్తూ మాత్రమే ఘటన జరిగిందని, ఇంతకుమించి తాము కూడా ఏమీ మాట్లాడలేమ‌ని తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

2022 మార్చి 9న జరిగిన ఈ ఘటనపై భారత్ ఇదివరకే వివరణ ఇచ్చింది. భారత వాయుసేన స్థావరంలో క్షిపణికి సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా క్షిపణి ఒక్కసారిగా మిస్ ఫైర్ అయ్యింది. ఒక్క‌సారిగా గాల్లోకి లేచి పక్కనే ఉన్న పాక్ భూభాగంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో ఉలిక్కిపడిన పాక్ ప్ర‌భుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే ఈ ఘ‌ట‌న‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని భారత రక్షణశాఖ ఘటనపై పాకిస్తాన్ సహా సంబంధిత విభాగాలకు వివరణ ఇచ్చింది. ఈ ఘ‌ట‌న‌లో అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. 

క్షిపణి విభాగంలో తనిఖీల సమయంలో అనుకోకుండా.. ప్రమాదవశాత్తూ జ‌రిగిన ఘ‌ట‌న అని, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం పార్లమెంటుకు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగకపోవడం కాస్త ఊరటనిచ్చిందని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. 2022 మార్చి 9న జరిగిన ఘటన గురించి సభకు తెలియజేశారు. 

సాధార‌ణ‌ తనిఖీల్లో భాగంగా.. ప్రమాదవశాత్తూ జరిగిన మిస్‌ఫైర్‌కు సంబంధించిన విషయం ఇది. మిసైల్ యూనిట్‌లో తనిఖీలు జరుగుతుండగా.. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఓ క్షిపణి ప్రమాదవశాత్తూ మిస్ ఫైర్ అయ్యింద‌ని రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం రాజ్యసభకు చెప్పారు. ఈ ఘటనను భార‌త ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. ప్రామాణిక కార్యకలాపాల విధానాలను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్టు ఇప్పటికే భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజ్యసభ్యకు తెలియజేశారు. 

మరోవైపు భారత క్షిపణి పాక్ భూభాగంలో పడటంలో పాక్ గగనతలాన్ని భారత్ ఉల్లంఘించిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో భారత్ రాయబారికి సమన్లు కూడా జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి లోతుగా దర్యాప్తు జరిపి, అసలు కారణం ఏమై ఉంటుందో తెలియజేయాలని భారత రాయబారికి స్పష్టం చేసింది పాక్ ప్ర‌భుత్వం.