వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలపై మిలియనీర్ల నిరసనలు.. ‘మాకు పన్ను వేయండి’
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలపై కొందరు మిలియనీర్లు నిరసనలు చేస్తున్నారు. ఈ సమావేశాలకు హాజరైన ప్రతినిధులపై పన్నులు వేసి ప్రపంచ దేశాల ఆర్థిక సంక్షోభం బరువును తగ్గించాలని అన్నారు. లివింగ్ కాస్ట్ వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ దావోస్ నగరంలో యేటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలకు భారీ క్రేజ్ ఉంటుంది. బిజినెస్ మ్యాన్లు, రాజకీయ నేతలు, ఆర్థిక వేత్తలు, ప్రభుత్వ పాలసీ రూపకర్తలు ఈ సమావేశాలకు వస్తుంటారు. ప్రతి యేటా జరిగే మీటింగ్కు ముందస్తుగా ఒక బేస్ లైన్ పెట్టుకుంటారు. ఈ టాపిక్ చుట్టే ప్రధాన చర్చ జరుగుతుంది. దావోస్ మీటింగ్లో ముఖ్యంగా పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థల చుట్టూ చర్చలు జరుగుతాయి. కానీ, పన్నుల గురించి, పేదరికం గురించి, లివింగ్ కాస్ట్ గురించి ఇక్కడ చర్చించేవారెవరూ ఉండరు. అయితే, ఈ సారి సమావేశాల్లో పాల్గొంటున్న కుబేరులకు వ్యతిరేకంగా కొందరు మిలియనీర్లు ధర్నాకు దిగారు.
పేట్రియాటిక్ మిలియనీర్స్ అనే ఓ గ్రూపు దావోస్ సమావేశాలకు హాజరయ్యే కుబేరులను నిరసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఎదుర్కొంటున్న లివింగ్ కాస్ట్ సమస్యను పరిష్కరించడానికి ప్రపంచంలోనే కుబేరులపై కొత్తగా పన్నులు విధించాలని వారు డిమాండ్ చేశారు. ఈ గ్రూపునకే చెందిన ఫిల్ వైట్ అనే వ్యక్తి తమ అజెండా గురించి మాట్లాడారు.
ఆర్థిక సంక్షోభంతో ప్రపంచ దేశాలన్నీ కునారిల్లిపోతుంటే.. ఈ బిలియనీర్లు, ప్రపంచ నేతలు ఇలా నాలుగు గోడల మధ్య ప్రైవేటుగా కలుసుకుని చరిత్రల మూలమలుపుల గురించి మాట్లాడుతుంటారని విమర్శించారు. ఈ సంక్షోభంపై ఆర్థిక పరమైన ప్రభావాలపై చాలా తక్కువ అవగాహన ఉండే వీరి మాటలను రాజకీయ నేతలు వినడం దారుణం అని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశాల నుంచి అందరికీ ఉపయోగపడే ఫలితం ఏదంటే.. సంపన్నులపై పన్ను విధించడమేనని, తమకు పన్ను వేయండి అని అన్నారు. దావోస్ 2022 సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధులపై పన్ను విధించండి అని వివరించారు.