పాకిస్థాన్ పై మరో సర్జికల్ స్ట్రైక్ ... ఈసారి ఇరాన్ వంతు
పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించి ఉగ్రవాద స్థావరాలపై దాడులకు తెగబడింది ఇరాన్. ఈ నేపథ్యంలో పాక్ కూడా సీరియస్ గా స్పందించింది.
![Iran conduct surgical strike in Pakistan AKP Iran conduct surgical strike in Pakistan AKP](https://static-ai.asianetnews.com/images/01gnssbv0mdtbh0j5xj71rvpfx/ukraine_363x203xt.jpg)
పాకిస్ధాన్ : పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై ఇరాన్ దాడులకు దిగింది. బలూచిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న జైష్ అల్ అడ్ల్ స్థావరాలపై ఇరాన్ సైన్యం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో రెండు ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమైనట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకటించింది.
అయితే తమ భూభాగంలోకి ప్రవేశించి ఇరాన్ దాడులకు దిగడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పాకిస్థాన్ పేర్కొంది. ఈ దాడుల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఇద్దరు చిన్నారులు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులపై ఇరాన్ రాయబార కార్యాలయాన్ని వివరణ కోరిన పాక్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
అయితే పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైష్ అల్ అడ్ల్ సున్నీ మిలిటెంట్ గ్రూప్. ఈ సంస్థను ఇరాన్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇరాన్ భద్రతా బలగాలపై అనేకసార్లు దాడులకు దిగి మారణహోమం సృష్టించింది ఈ ఉగ్రవాద సంస్థ. దీంతో పాక్ గగనతలంలోకి ప్రవేశించి మరీ జైష్ అల్ అడ్లీ స్ధావరాలపై దాడులకు దిగింది ఇరాన్.
Also Read ముంబై దాడుల కుట్రదారు, ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మృతి.. ఐక్యరాజ్య సమితి ధృవీకరణ..
ఉగ్రవాద కార్యకలాపాలను ఏ దేశమూ సమర్దించదని ... దీని వల్ల అన్ని దేశాలకు ప్రమాదం పొంచివుందని పాకిస్థాన్ పేర్కొంది. దీన్ని అన్ని దేశాలు కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం వుంది... అంతేగానీ ఓ దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించి మరో దేశం దాడులకు తెగబడటం మంచిది కాదన్నారు. ద్వైపాక్షిక బంధాన్ని దెబ్బతీసేలా ఇరాన్ చర్యలు వున్నాయని పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.