భారత్‌నుంచి వలస వెళ్ళిన అత్యధిక మందికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, అమెరికా, సౌదీ అరేబియాలు ఆశ్రయం కల్పిస్తోన్నాయి. 

ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రజలు వలస వెళ్లడం సర్వ సాధారణం. భారతీయులు సైతం ఎక్కువ సంపాదన కోసం విదేశాలకు వలస వెళుతూనే ఉంటారు. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలకు వలసలు వెళ్లేవారిలో భారతీయులే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. 2020లో ప్రపంచవ్యాప్తంగా భారత్ నుంచి 1.8కోట్ల మంది ఇతరదేశాలకు వలస వెళ్లారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఐక్యరాజ్య సమితి పాపులేషన్‌ డివిజన్, తాజాగా విడుదల చేసిన ‘ఇంటర్నేషనల్‌ మైగ్రేషన్‌ 2020 హైలైట్స్‌’ నివేదిక, 2020లో 1.8 కోట్ల మంది భారతీయులు విదేశాలకు వలస వెళ్ళినట్లు వెల్లడించింది.


భారత్‌నుంచి వలస వెళ్ళిన అత్యధిక మందికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, అమెరికా, సౌదీ అరేబియాలు ఆశ్రయం కల్పిస్తోన్నాయి. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ జనాభాలో భారత్‌ప్రథమ స్థానంలో ఉంది. భారత్‌ నుంచి అత్యధికంగా, గణనీయమైన సంఖ్యలో 1.8 కోట్ల మంది ప్రజలు విదేశాలకు వలస వెళ్ళారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారతీయులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు’’అని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ అఫైర్స్‌(యుఎన్‌డేసా)లోని జనాభా విభాగంలోని జనాభా వ్యవహారాల అధికారి క్లేర్‌ పేర్కొన్నారు.

2000-2020 మధ్య కాలంలో 179 దేశాల్లోని వలసల సంఖ్య పెరిగింది. ఈ సమయంలో జర్మనీ, స్పెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ, అమెరికాల్లో అత్యధిక సంఖ్యలో వలసలు పెరిగాయి. అయితే అందుకు పూర్తి భిన్నంగా 2000, 2020 మధ్య కాలంలో 53 దేశాలు, లేదా ప్రాంతాల్లోని అంతర్జాతీయ వలసలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా, ఇండియా, పాకిస్తాన్, ఉక్రెయిన్, దేశాల్లో 2000–20 మధ్య కాలంలో అంతర్జాతీయ వలసల సంఖ్య భారీగా పడిపోయింది. అనేక దేశాల్లో సేవారంగం, హోటళ్ళలోనూ పనిచేసే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవడంతో ఇళ్లకు వచ్చారు. కోవిడ్‌ కారణంగా మద్య ఆదాయ దేశాలకు వలసల ద్వారా వచ్చే ఆదాయం 14 శాతం తగ్గింది. ఈ దేశాలకు వలసల ద్వారా వచ్చే ఆదాయం 2019లో 548 బిలియన్‌ డాలర్లు ఉండగా, 2021కి ఇది 470 బిలియన్‌ డాలర్లకు క్షీణించింది. 

కోవిడ్‌తో తగ్గిన వలసలు.. 
కోవిడ్‌ మహమ్మారి అంతర్జాతీయంగా వలస వెళ్ళే వారిని 20 లక్షల మేర తగ్గించిందని, 2019 మధ్య కాలం నుంచి ఆశించిన వృద్ధికంటే వలసవెళ్ళిన వారు 27 శాతం తక్కువ అని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయంగా వలసల సంఖ్య బాగా పెరుగుతూ వచ్చింది. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా సొంత దేశాల్లో నివసిస్తున్న వారి సంఖ్య 28.1 కోట్లకు చేరింది. 2000 సంవత్సరంలో 17.3 కోట్ల మంది, 2010లో 22.1 కోట్ల మందికి వలసవెళుతున్న వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ మైగ్రెంట్స్‌ సంఖ్య యావత్‌ ప్రపంచం జనాభాలో 3.6 శాతంగా ఉంది.