బోరిస్ కేబినెట్ లో ఇన్పోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి: మరో ఇద్దరు కూడా..
రిషి సునక్ను ట్రెజరీ విభాగ చీఫ్ సెక్రటరీగా నియమించినట్లు యూకే ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. 39ఏళ్ల రిషి సునక్ ఇంగ్లాండ్లో హాంప్షైర్ కౌంటీలో జన్మించారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
లండన్: ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్కు కీలక పదవి దక్కింది. యూకే ప్రభుత్వంలో ట్రెజరీ విభాగ చీఫ్ గా ఛాన్స్ కొట్టేశారు.
బ్రిటన్ నూతన ప్రధానిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సీనియర్ నేత బోరిస్ జాన్సన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కేబినెట్ కూర్పుకు శ్రీకారం చుట్టారు. అయితే రిషి సునక్ తోపాటు మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు కేబినెట్ లో చోటు కల్పించారు.
రిషి సునక్ను ట్రెజరీ విభాగ చీఫ్ సెక్రటరీగా నియమించినట్లు యూకే ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. 39ఏళ్ల రిషి సునక్ ఇంగ్లాండ్లో హాంప్షైర్ కౌంటీలో జన్మించారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
2015లో జరిగిన ఎన్నికల్లో యార్క్షైర్లోని రిచ్మాండ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. గతంలో థెరిసా మే ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం చీఫ్ సెక్రటరీ హోదాలో రిషి కేబినెట్ సమావేశాలకు హాజరుకానున్నారు.
ఇకపోతే స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో ఎంబీఏ చదువుతున్న రోజుల్లో నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని ప్రేమించాడు రిషి. అనంతరం ఇరుకుటుంబాలు అంగీకారం తెలపడంతో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
బోరిస్ కేబినెట్ లో రిషి సునక్ తోపాటు భారత సంతతికి చెందిన అలోక్ శర్మ, ప్రీతి పటేల్కు కూడా అవకాశం కల్పించారు. యూపీలోని ఆగ్రాలో జన్మించిన అలోక్ శర్మ బ్రిటన్లో స్థిరపడ్డారు. 2010లో రీడింగ్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.
థెరిసా మే ప్రభుత్వంలో పర్యావరణ మంత్రిగా కూడా పనిచేశారు అలోక్ శర్మ. ప్రస్తుత బోరిస్ కేబినెట్ లో ఇంటర్నల్ డెవలప్మెంట్ సెక్రటరీగా నియమితులయ్యారు. మరోవైపు ప్రీతి పటేల్ కొత్త కేబినెట్లో హోం సెకట్రరీగా నియమితులయ్యారు. యూకే కేబినెట్ లో హోం సెక్రటరీగా నియమితులైన ఏకైక మహిళగా ప్రతీపటేల్ రికార్డు సృష్టించారు.