నూపుర్ శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ కువైట్ లోని ఫహాహీల్ ప్రాంతంలో గత శుక్రవారం భారత్ కు చెందిన ముస్లింలు ఆందోళన చేపట్టారు. అయితే ఆ దేశ చట్టాల ప్రకారం ఇతర దేశస్తులు అక్కడ ఎలాంటి నిరసన ప్రదర్శలు చేపట్టరాదు. ఈ నేపథ్యంలో వారిని ఆ దేశం బహిష్కరించింది.
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గత శుక్రవారం ప్రార్థనల అనంతరం దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు సాగిన సంగతి తెలిసిందే. అయితే ఇవి దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. విదేశాల్లోనూ పలు చోట్ల, ముఖ్యంగా అరబ్ దేశాల్లో కనిపించాయి. ఆయా దేశాల్లో భారతీయ ముస్లింలు ఆందోళనలు చేపట్టారు. అలాగే కువైట్ లోనూ నిరసన చేపట్టిన ముస్లింలకు ఆ దేశం షాక్ ఇచ్చింది. దేశం నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.
మహ్మద్ ప్రవక్త కు మద్దతుగా గత శుక్రవారం ప్రార్థనల తర్వాత కువైట్ లోని ఫహాహీల్ ప్రాంతంలో భారతీయ ముస్లింలు నిరసన చేపట్టారు. ఈ నిరసనల్లో పాల్గొన్న వారిని అరెస్టు చేసి తీసుకురావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో పాల్గొన్న వారిని దేశం నుంచి బహిష్కరించనున్నట్టు వర్గాలు తెలిపాయి. కువైట్లోని చట్టాల ప్రకారం ప్రవాసులు దేశంలో ఎలాంటి నిరసన ప్రదర్శనలూ చేపట్టరాదు. ఆ దేశ చట్టాలను ప్రవాసులు తప్పకుండా గౌరవించి పాటించాలి. అయితే ఈ నిబంధనలు నిరసనకారులు ఉల్లంఘించారు. కాబట్టి దేశం నుంచి బహిష్కరణ అవుతారని అక్కడి అధికారులు ధృవీకరించారు.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు అధికారులు ఈ నిరసన కారులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నిందితుల (అక్కడి చట్టాల ప్రకారం)ను అదుపులోకి తీసుకున్నతరువాత వారిని ఆయా దేశాలకు పంపించివేయాలని డిపోర్టేషన్ కేంద్రాన్నిసూచిస్తారు. దీంతో వారెవరూ మళ్లీ కువైట్ కు వెళ్లకుండా నిషేదానికి గురవుతారు. ఈ సందర్భంగా ప్రవాసులు కువైట్ చట్టాలను గౌరవించాలని, ప్రదర్శనల్లో పాల్గొనవద్దని అధికారులు హెచ్చరించారు.
కాగా ప్రవక్తను దూషించినందుకు కువైట్ అధికారికంగా ఇప్పటికే తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. అలాగే మహ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కువైట్లోని స్థానిక సూపర్ మార్కెట్ భారతీయ ఉత్పత్తులను బహిష్కరించింది. కువైట్లోని స్థానిక అల్-అర్దియా కోఆపరేటివ్ సొసైటీ స్టోర్లో కార్మికులు నిరసనలో భాగంగా భారతీయ ఉత్పత్తులను బహిష్కరించారు. సూపర్మార్కెట్లో భారతీయ ఉత్పత్తులను విక్రయించేందుకు అరలను ప్లాస్టిక్ షీట్లతో కప్పి ఉంచి, అందులో నుంచి భారతీయ ఉత్పత్తులను తొలగించారు.
రాష్ట్రపతి ఎన్నికలు : షాకిచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్.. పోటీ చేస్తానంటూ ప్రకటన, కానీ ట్విస్ట్
జ్ఞాన్ వ్యాపి మసీదు, శివలింగం అంశంపై ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్ లో బీజేపీ మాజీ అధికార ప్రతినిధఙ నూపుర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింల అరాధ్యుడైన మహ్మద్ ప్రవక్తపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రయాగ్ రాజ్ తో పాటు మరి కొన్ని పట్ణణాల్లో ఆందోళనలు జరిగాయి. గత శుక్రవారం కూడా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. పశ్చిమ బెంగాల్ లోని హౌరా చేపట్టిన నిరసనలు కూడా హింసాత్మకంగా మారాయి. కాగా దేశంలో నూపుర్ శర్మను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నట్టుగానే.. ఆమెకు మద్దతుగా కూడా ర్యాలీలు తీస్తున్నారు.
