ఐసోలేషన్ నుంచి సూపర్ మార్కెట్ కి వెళ్లిన కరోనా రోగి..!
కాగా సూపర్ మార్కెట్లో ఆ వ్యక్తి 20 నిమిషాలు గడిపాడని, 70 నిమిషాల తర్వాత అతడు స్వయంగా ఐసోలేషన్ కేంద్రానికి తిరిగి చేరుకున్నాడని హిప్కిన్స్ చెప్పారు.
కరోనా వైరస్ సోకిన రోగులు బయటకు అడుగుపెడితే ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే. ఆ వ్యక్తి నుంచి మరికొందరికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. అయితే..ఓ వ్యక్తి మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఐసోలేషన్ కేంద్రం నుంచి తప్పించుకొని పోయి... ఓ సూపర్ మార్కెట్ కి వెళ్లాడు. ఈ సంఘటన ఆక్లాండ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆక్లాండ్ కి చెందిన వ్యక్తి ఇటీవల భారత్ నుంచి అక్కడకు వెళ్లాడు. కొద్దిరోజులకే అతనికి కరోనా సోకినట్లు గుర్తించారు. జులై 3న ఢిల్లీ నుంచి వచ్చిన ఈ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్గా తేలిన అనంతరం క్వారంటైన్కు తరలించారు. కాగా ఈ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని, ఏ ఒక్కరితోనూ సన్నిహితంగా మెలగలేదని వెల్లడించినట్టు అధికారులు తెలిపారు.
అయితే.. కోవిడ్-19 పాజిటివ్గా తేలిన వ్యక్తి ఐసోలేషన్ కేంద్రం నుంచి అదృశ్యమవడం తీవ్రమైన విషయమని ఆరోగ్య మంత్రి క్రిస్ హిప్కిన్స్ అన్నారు. అతడి చర్యలు స్వార్థపూరితమని, ఆ వ్యక్తిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
కాగా సూపర్ మార్కెట్లో ఆ వ్యక్తి 20 నిమిషాలు గడిపాడని, 70 నిమిషాల తర్వాత అతడు స్వయంగా ఐసోలేషన్ కేంద్రానికి తిరిగి చేరుకున్నాడని హిప్కిన్స్ చెప్పారు. ఐసోలేషన్ కేంద్రం నుంచి వెళ్లినందుకు అతడికి ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ 2.8 లక్షల జరిమానా విధిస్తారని న్యూజిలాండ్ హెరాల్డ్ పేర్కొంది. కాగా కరోనా పాజిటివ్గా తేలిన వ్యక్తి తమ స్టోర్కు వచ్చాడని తెలియడంతో సూపర్మార్కెట్ సిబ్బంది స్వీయ నియంత్రణలోకి వెళ్లారు. వారందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు