India-France Relationship:ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇద్దరు నేతలు ఇండో-ఫ్రెంచ్ వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆహారం, ఇంధన భద్రతతో సహా ప్రపంచ, ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై  చర్చిన‌ట్టు స‌మాచారం. 

India-France Relationship: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌తో ఫోన్ లో మాట్లాడారు. ఫ్రాన్స్ లో విపరీతమైన అడవి మంటలు, కరువు పరిస్థితులను ఎదుర్కోవడంపై సంఘీభావాన్ని ప్రకటించారు. ఇరువురు నేతలు . భౌగోళిక రాజకీయ సవాళ్లు, పౌర అణు ఇంధన సహకారంపై చ‌ర్చిన‌ట్టు PMO ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. అలాగే భారతదేశం, ఫ్రాన్స్ మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక కార్యక్రమాలను సమీక్షించారు.  

ప్రధాని కార్యాల‌యం (PMO) ప్రకారం.. ఇరువురు నేత‌ల ఫోన్ సంభాషణలో రక్షణ సహకారం, పౌర అణుశక్తికి సంబంధించిన ప్రాజెక్టులతో సహా భార‌త్, ఫ్రాన్స్ మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక కార్యక్రమాలను సమీక్షించారు. ప్రపంచ ఆహార భద్రతతో సహా ముఖ్యమైన భౌగోళిక రాజకీయ సవాళ్లను కూడా వారు చర్చించారు.
 
ఇటీవలి కాలంలో ఇండో-ఫ్రెంచ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధాన్ని మరింత విస్తరించడానికి కొత్త సహకార రంగాలలో కలిసి పనిచేయడానికి అంగీకరించారని PMO తెలిపింది.

అలాగే ప్రెసిడెంట్ మాక్రాన్‌తో చర్చ సందర్భంగా ఫ్రాన్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనకు భారత్‌ సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్‌లో తెలిపారు. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన ఇతర అంశాలపై కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారంపై చర్చించామని ప్రధాని ట్వీట్ చేశారు.

ఆహారం, ఇంధన భద్రతకు సంబంధించిన ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇరుదేశాల‌ సహకారంపై కూడా అంగీకరించారని మోదీ తెలిపారు. రష్యా,  ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఆహార భద్రత సవాళ్ల గురించి భారతదేశం, ఫ్రాన్స్ ఆందోళన వ్య‌క్తం చేస్తున్నాయి.

 

Scroll to load tweet…

గత కొద్ది రోజులుగా యూరప్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం జరుగుతుండగా, దానిని ఆర్పేందుకు జర్మనీ, రొమేనియాతో పాటు యూరప్ లోని పలు దేశాలు నిమగ్నమైన సంగతి తెలిసిందే. ఈ మంటలు పోర్చుగల్, ఇంగ్లాండ్‌లోని కొన్ని ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. అడవుల్లో మంటలు చెలరేగడంతో వేల హెక్టార్లలో పంటలు కూడా నాశనమయ్యాయి. విపరీతమైన వేడి, కరువు కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది.