భారత్ తిరస్కరణ నిరాశ కలిగించింది: ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ తో చర్చలకు భారత్ వెనక్కి తగ్గడంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలకు సిద్దమన్న తమ ప్రతిపాదనను తిరస్కరించడం నిరాశకు గురిచేసిందన్నారు. తన ప్రతిపాదనపై వెనక్కితగ్గడంతో భారత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఇమ్రాన్ ఖాన్ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు.
కరాచీ : పాకిస్థాన్ తో చర్చలకు భారత్ వెనక్కి తగ్గడంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలకు సిద్దమన్న తమ ప్రతిపాదనను తిరస్కరించడం నిరాశకు గురిచేసిందన్నారు. తన ప్రతిపాదనపై వెనక్కితగ్గడంతో భారత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఇమ్రాన్ ఖాన్ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు.
శాంతి కోసం చర్చలకు రావాలని నేను రాసిన లేఖకు భారత్ నుంచి అహంకారపూరిత ప్రతికూల స్పందన రావడం నిరాశ కలిగించింది. ఏది ఏమైనప్పటికి పెద్ద పెద్ద కార్యాలయాల్లో కూర్చుని ఎలాంటి లక్ష్యం లేకుండా పనిచేసే వారిని నా జీవితంలో చాలా మందినే చూశానంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.
భారత్తో ద్వైపాక్షిక చర్చలకు సిద్దమంటూ ఈ నెల 14న మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ లేఖ రాశారు. భారత్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం 2015లో చివరి సారిగా జరిగింది. ఆ తర్వాత మళ్లీ జరగలేదు. ఆ చర్చలను మళ్లీ కొనసాగించాలని లేఖలో కోరారు. అయితే భారత్ 2016 పఠాన్కోట వైమానిక కోటపై పాక్ భారీ దాడికి పాల్పడడంతో ద్వైపాక్షిక చర్చలను నిలిపివేసింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఇంతవరకూ చర్చలు జరగలేదు.
ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదనపై తొలుత సానుకూలంగా స్పందించిన భారతప్రభుత్వం న్యూయార్క్ లో ఇరుదేశాలు భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ అయ్యేందుకు అంగీకారం తెలిపింది. ఓ వైపు చర్చలు అంటూనే మరోవైపు పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటంతో భారత్ వెనక్కి తగ్గింది.
కశ్మీర్ సరిహద్దుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాన్, ముగ్గురు ఎస్పీవోలను పాక్ దారుణంగా హత్య చేసింది. ఈ నేపథ్యంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్తో చర్చలెలా జరుపుతామంటూ భారత ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.