పాకిస్తాన్ లో ఘోరం..దైవ దూషణ చేశాడని శ్రీలంకవాసిని కొట్టి చంపి, దహనం చేసి.. టీఎల్పీ కార్యకర్తల దుశ్చర్య..
దైవ దూషణ చేశాడంటూ శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని పాకిస్తాన్లో కొట్టి చంపారు. అనంతరం అక్కడే దహనం చేశారు.
పాకిస్తాన్ లో దారుణం జరిగింది. శ్రీలంక దేశానికి చెందిన ఓ వ్యక్తిని విపరీతంగా కొట్టి చంపి, అనంతరం మృతదేహాన్ని రోడ్డుపైనే దహనం చేశారు. ఈ దహనానికి సంబంధించిన వీడియోలు శుక్రవారం సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ ఘటనకు కారణమైన వారిని చట్టపరంగా శిక్షిస్తామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. పాకిస్తాన్ సిగ్గుపడాల్సిన రోజు అని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
పోస్టర్ చింపేసినందుకే..
శ్రీలంక కు చెందిన ప్రియాంత కుమార (40) పంజాబ్ ప్రావిన్స్ సియాల్కోట్లోని ఓ బట్టల దుకాణంలో మేనేజర్గా పని చేస్తున్నారు. రోజూలాగే శుక్రవారం కూడా తన విధులకు హాజరయ్యాడు. అయితే తన క్యాబిన్ పక్కన ఓ పోస్టర్ అతికించి ఉండటాన్ని గమనించాడు. అది అతివాద పార్టీకి అయిన తెహ్రక్ -ఇ-లబ్బాయక్ (టీఎల్పీ)కు చెందిన పోస్టర్. ఈ పోస్టర్ ప్రియాంత కుమార్కు నచ్చకపోవడంతో దానిని చింపి పక్కనే ఉన్న డస్ట్బిన్లో పడేశాడు. ఇందులో ముస్లింల పవిత్ర గ్రంథమయిన ఖురాన్కు సంబంధించిన పలు వ్యాఖ్యాలు ఉన్నాయి. అతడు ఆ పోస్టర్ను చింపి, డస్ట్బిన్లో పడేసిన విషయం బయటకు వెళ్లింది. దీంతో టీఎల్పీ కార్యకర్తలకు ఆగ్రహానికి గురయ్యారు. గుంపుగా అతడి బట్టల దుకాణం వద్దకు వెళ్లి ప్రియాంతను బయటకు రోడ్డుపైకి తీసుకొచ్చారు. రోడ్డుపైనే అతడిని విపరీతంగా కొట్టారు. వాళ్లు కొట్టిన దెబ్బలకు అతడు అక్కడే చనిపోయాడు.
పోలీసులకు రాకముందే దహనం..
శ్రీలంక దేశీయుడిని టీఎల్పీ కార్యకర్తలు కొట్టి చంపిన విషయం పాకిస్తాన్ పోలీసులకు తెలిసింది. దీంతో వాళ్లు ఘటనా స్థలానికి బయలుదేరారు. కానీ వారు అక్కడికి వచ్చేలోపే టీఎల్పీ కార్యకర్తలు ప్రియాంత మృతదేహాన్ని కాల్చిచంపేశారు. ఈ ఘటన పాకిస్తాన్లో కలకలం సృష్టించింది. మృతదేహాన్ని కాల్చిన వీడియో పాకిస్తాన్ సోషల్ మీడియాలో వీపరీతంగా స్ప్రెడ్ అయ్యింది. ఈ ఘటన జరిగినప్పుడు చాలా మంది అక్కడ సెల్ఫీలు తీసుకున్నారు. ఎవరూ తమ మొఖాలను దాచుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఈ విషయం అక్కడ లభించిన వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకొని 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. ‘అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. ఇప్పటికీ పలువురిని అదుపులోకి తీసుకున్నాం. త్వరలోనే ఘటనకు కారణమైన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకంటాం‘ అని పంజాబ్ అధికార ప్రతినిధి హసన్ ఖావర్ పంజాబ్ లో మీడియాతో తెలపారు.
ఘటనపై స్పందించిన ఇమ్రాన్ఖాన్..
శ్రీలంక దేశీయుడిని పాకిస్తాన్లో టీఎల్పీ కార్యకర్తలు కొట్టి చంపి, దహనం చేసిన ఘటనపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ స్పందించారు. ‘సిలియాకోట్ లో ఈరోజు జరిగిన ఘటన దారుణం. శ్రీలంక దేశీయుడిని కాల్చిచంపడం అనైతికం. ఈరోజు పాకిస్తాన్ మొత్తం సిగ్గుపడాల్సిన రోజు. దీనిపై వెంటనే విచారణకు ఆదేశిస్తున్నాను. ఈ ఘటనకు కారణమైన వారందరినీ చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తాం. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నాం. ఈ ఘటన దర్యాప్తును నేను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తాను.’ అని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించాడు. ఈ ఘటన వల్ల పాకిస్తాన్ లో ఉంటున్న శ్రీలంక దేశీయులు ఆందోళన చెందుతున్నారు.