ఇరాన్ లో ముదురుతున్న హిజాబ్ నిరసనలు.. ఇంటర్నెట్ షట్డౌన్
Iran Protests: ఇరాన్ లో హిజాబ్ నేపథ్యంలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్ మీడియా-స్థానిక ప్రాసిక్యూటర్ గత రెండు రోజుల్లో నలుగురు వ్యక్తులు మరణించారని పేర్కొన్నారు. అయితే, అధికారిక మూలాల ప్రకారం మొత్తం మరణాల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.
hijabj-Iran Protests: ఇరాన్ లో హిజాబ్ క్రమంలో ఆందోళనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇరాన్ మీడియా-స్థానిక ప్రాసిక్యూటర్ గత రెండు రోజుల్లో నలుగురు వ్యక్తులు మరణించారని, అధికారిక మూలాల ప్రకారం మొత్తం మరణాల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది, ఇందులో పోలీసు సభ్యుడు మరియు ప్రభుత్వ అనుకూల మిలీషియా సభ్యుడు ఉన్నారు. వివరాల్లోకెళ్తే.. టెహ్రాన్ సందర్శించేందుకు మహ్సా అమిని(22) అనే యువతి తన కుటుంబంతో కలిసి వెళ్లగా.. ఆ సమయంలో హిజాబ్ ధరించలేదనే కారణంతో పోలీసులు ఆ యువతిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో యువతిని చిత్రహింసలు పెట్టడంతో మరుసటి రోజే మరణించింది. దీంతో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి మహిళల నుంచి పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరును ఖండిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు దిగారు. మహిళలు తమ హిజాబ్ను తీసివేసి, జుట్టు కత్తిరించుకుంటూ వీడియోలు పెడుతూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసు స్టేషన్లు, వాహనాలను నిప్పుపెట్టిన నిరసనకారులు
ఇరాన్ రాజధాని టెహ్రాన్, దేశంలోని అనేక ఇతర నగరాల్లో నిరసనకారులు గురువారం పోలీసు స్టేషన్లు, వాహనాలను తగులబెట్టారు. మహ్సా అమినీ మరణం తర్వాత.. ఆరవ రోజుకూడా ఆందోళనలు మరింత తీవ్రం కావడంతో చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇరాన్ లోని దాదాపు 50 కి పైగా నగరాలు, ఇతర పట్టణాలకు నిరసనలు వ్యాపించాయి.
ఇంటర్నెట్ షట్ డౌన్..
ప్రజా ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే అనేక ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు ఇరాన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇంటర్నెట్ షట్ డౌన్ విధించింది. అయితే, అక్కడి మహిళలు, యువతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ వీధుల్లోకి వస్తున్నారు. హిజాబ్ ను తీసివేసి.. కాల్చడం, చించివేస్తూ నిరసన తెలుపుతున్న వీడియోలు వైరల్ గా మారాయి.
ఈ నిరసనల నేపథ్యంలో మరణించిన వారి సంఖ్య 10 దాటిందని పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.