దక్షిణాఫ్రికాలో వరదలు విజృంభిస్తున్నాయి. ఈ వరదల వల్ల ఇప్పటి వరకు 400 మంది చనిపోయారు. వేలాది మంది రోడ్డున పడ్డారు. వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.
దక్షిణాఫ్రికాను వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇక్కడ జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎంతో మంది గల్లంతవుతున్నారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. వారి ఇళ్లను వరద నీరు ఆక్రమించి తీవ్ర విధ్వంసం సృష్టిస్తోంది. దీంతో చాలా మంది ఇళ్లను వదిలిపెట్టి బయటకు వస్తున్నారు.
దక్షిణ ఆఫ్రికా తీర ప్రాంత నగరమైన డర్బన్లో ఈ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇక్కడ శనివారం నాటికి మరణాల సంఖ్య దాదాపు 400కి చేరుకుంది. దాదాపు 40,000 మంది నిరాశ్రయులుగా మారారు. వరదల వల్ల ఇక్కడి రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. రోడ్లకు చీలికలు ఏర్పడ్డాయి. ఆసుపత్రులు కూడా ధ్వంసం అయ్యాయి. వరదలు వచ్చిన సమయంలో ఇళ్లలో చిక్కుకున్న వారు అందులోనే చనిపోయారు.
ఈ డర్బన్ నగరం ఆగ్నేయ క్వాజులు-నాటల్ (KZN) ప్రావిన్స్లో భాగంగా ఉంది. ఇక్కడ దాదాపు 3.5 మిలియన్ల జనాభా ఉంది. ఇక్కడ అత్యవసర సేవలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మృతుల సంఖ్య శనివారం 398కి చేరుకోగా, 27 మంది అదృశ్యమయ్యారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 40,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారని ప్రకటించింది.
‘‘ దురదృష్టవశాత్తూ ఇప్పటికీ ఇళ్ల స్థలాల నుండి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి మృతదేహాలు వెలికితీయబడుతున్నాయి" అని అధికారులు AFPకి చెప్పారు. ఇంకా కురుస్తున్న అధిక వర్షాల వల్ల ఎక్కువ నష్టం జరుగుతోందని తెలిపారు. ఈ నగరం మట్టి నీటితో ఎక్కువగా నిండిపోయి ఉంది. దీంతో మరింత వరదలు వచ్చే అవకాశం ఉంది.
ఈ నగరంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ, అమాజులు, మారిట్జ్బర్గ్ యునైటెడ్ మధ్య స్థానిక ప్రీమియర్షిప్ లీగ్ ఫుట్బాల్ మ్యాచ్ శనివారం మోసెస్ మభిదా స్టేడియంలో జరిగింది. అయితే వరద బాధితులకు గౌరవసూచకంగా నగరంలో జరగాల్సిన క్యూరీ కప్ రగ్బీ మ్యాచ్ రద్దు చేశారు. కాగా ఈ నగరంలో పోలీసులు, దళాలు, వాలంటీర్లు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్కు నాయకత్వం వహిస్తున్నారు.
ఈ వరద వల్ల 13,500 కంటే ఎక్కువ ఇళ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 4 వేల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 58 హాస్పిటల్స్, క్లినిక్ లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని ప్రభుత్వం తెలిపింది. స్వచ్ఛమైన నీటి కొరత ఉందని, నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. నివాసితులు నీటి బకెట్లను తీసుకెళ్లడానికి షాపింగ్ ట్రాలీలను ఉపయోగిస్తున్నారు.
ప్రభుత్వం ఈ వరదల సహాయార్థం ఒక బిలియన్ ర్యాండ్ (68 మిలియన్ డాలర్లు) అత్యవసర సహాయ నిధిని ప్రకటించింది. మంగళవారం ప్రారంభం కావాల్సిన అధ్యక్షుడు సిరిల్ రామఫోసా సౌదీ అరేబియా పర్యటనను వాయిదా వేసినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ‘‘ దాదాపు 400 మంది జీవితాలు, వేలాది వేలాది గృహాలకు నష్టం జరిగింది. మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి. ఆర్థికంగా కూడా నష్టం జరిగింది అని ’’అని రమాఫోసా అన్నారు.
