ఇరాన్లో రద్దీ మార్కెట్లో ఆందోళనకారులపై కాల్పులు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు
ఇరాన్లో రద్దీగా ఉండే ఓ మార్కెట్లో ఆందోళనకారులు, సెక్యూరిటీ ఫోర్సెస్ పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. కనీసం 10 మంది మరణించినట్టు ఇరాన్ అధికారిక మీడియా బుధవారం రిపోర్ట్ చేసింది.
న్యూఢిల్లీ: ఇరాన్లో ప్రభుత్వం మహిళలకు నిర్దేశించిన డ్రెస్ కోడ్ను నిరసిస్తూ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్లో మహ్సా అమీని మరణం తర్వాత ఈ ఆందోళనలు ఉధృతరూపం తీసుకున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఇరాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను ప్రకటించారు. ఇప్పటికీ ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా, రద్దీగా ఉండే ఓ మార్కెట్లో ఈ ఆందోళనలు చేపడుతుండగా కొందరు నిరసనకారులపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ఆందోళనకారులు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు.
కొన్ని ఉగ్రవాద శక్తులు నిరసనకారులు, భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపాయని అధికారవర్గాలు తెలిపాయి. ఇరాన్ నైరుతి వైపున ఉండే ఖుజెస్తాన్ ప్రావిన్స్లో ఈ కాల్పులు జరిగాయని అధికారిక మీడియా బుధవారం రిపోర్ట్ చేసింది.
Also Read: హిజాబ్ల దహనం.. జుట్టు కత్తిరించుకుంటున్న ఇరాన్ మహిళలు.. ఎందుకో తెలుసా?
రెండు మోటార్ సైకిల్స్ పై సాయుధ, ఉగ్రవాద శక్తులు ఇజెహ్ సిటీలోని సెంట్రల్ మార్కెట్లోకి వచ్చాయని, అక్కడే నిరసనకారులు, సెక్యూరిటీ ఫోర్సెస్పై ఫైరింగ్ చేశాయని ఐఆర్ఎన్ఏ రిపోర్ట్ చేసింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. కనీసం 10 మంది మరణించారని పేర్కొంది. అయితే, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు.
అక్టోబర్ 26న ఓ ఉగ్రదాడిలో కనీసం 13 మంది మరణించారు. షిరాజ్లో జరిగిన ఈ ఘటనకు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది.