అభిశంసనకు గురైన ట్రంప్: తోలి అమెరికా అధ్యక్షుడు ఆయనే
మరో వారం రోజుల్లో గద్దె దిగనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అభిశంసనకు గురయ్యారు. రెండుసార్లు అభిశంసనకు గురైన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. మరో వారం రోజుల్లో అధికారానికి దూరం కానున్న ఆయన అభిశంసనకు గురి కావడం ఇది రెండోసారి. అరెండు సార్లు అభిశంసనకు గురి అయిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలోకి ఎక్కనున్నారు.
క్యాపిటల్ హిల్ ముట్టడిని ప్రోత్సహించారంటూ అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్ మీద ప్రతిపాదించిన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. జోబైడెన్ విజయాన్ని ధ్రువీకరిస్తూ ఈ నెల 6వ తేదీన వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ భనవంలో అమెరికా కాంగ్రెసు సమావేశమైంది.
ఆ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని ముట్టడించారు. దాంతో పోలీసులకు, ట్రంప్ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు మరణించారు. ట్రంప్ కావాలనే తన మద్దతుదారులను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ డెమొక్రాట్లు ట్రంప్ మీద ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రతిపాదించారు. దానికి మెజారిటీ సభ్యులు మధ్దతు పలికారు. దీంతో ట్రంప్ అభిశంసనకు గురయ్యారు.
ఆ తీర్మానాన్ని సెనేట్ కు పంపిస్తారు. జనవరి 20వ తేదీన బైడెన్ పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆ తర్వాత ట్రంప్ మీద విచారణ జరుగుతుంది.
కాగా, 25వ రాజ్యాంగ సవరణను వాడి ట్రంప్ ను పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ను కోరుతూ డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో తీర్మానం ప్రతిపాదించారు. 25వ రాజ్యాంగ సవరణ చట్టం కింద ఉపాధ్యక్షుడు, క్యాబినెట్ లోని మెజారిటీ సభ్యులు తీర్మానించడం ద్వారా అధ్యక్షుడిని తొలగించే వీలుంది.
సోమవారంనాడే ఆ తీర్మానాన్ని ప్రతిపాదించినప్పటికీ రిపబ్లిక్ సభ్యులు అడ్డుకున్నారు. 25వ సవరణ అధికారాన్ని ఉపయోగించేందుకు తాను సిద్ధంగా లేనట్లు ఉపాధ్యక్షుడు పెన్స్ సంకేతాలిచ్చారు. అయినప్పటికీ స్పీకర్ పెలోసీ ఆ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. తీర్మానాన్ని ఉపాధ్యక్షుడు పెన్స్ తోసిపుచ్చారు.
దాంతో ప్రతినిధుల సమభలో డెమొక్రాట్లు సోమవారం ప్రతిపాదించిన అభిశంసన తీర్మానంపై ప్రతినిధుల సభలో చర్చ జరిగింది. ట్రంప్ ను పదవి నుంచి తొలగించాలని పలువురు సభ్యులు ఓటేశారు. దీంతో ట్రంప్ అభిశంసనకు గురయ్యారు.