ఇండోనేషియాలో భూకంపం: రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రత నమోదు
ఇండోనేషియాలో బుధవారం నాడు భూకంపం వాటిల్లింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని అధికారులు చెప్పారు.

జకార్తా: ఇండోనేషియాలో బుధవారంనాడు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.1 తీవ్రతగా నమోదైంది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారంగా భూకంప కేంద్రం గోరంటాలో ఆగ్నేయానికి సమీపంలో సముద్రం లోపల 147 కిలోమీటర్ల లోతులో ఉంది.
దేశంలోని గోరంటాలో నార్త్ సులవేసి, నార్త్ మలుకు, సెంట్రల్ సులవేసి ఫ్రావిన్స్ లలో భూకంపం వాటిల్లింది. అయితే ఎటువంటి తీవ్రమైన నష్టం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు. భూకంపం కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలు కూడ జారీ చేయలేదు. ఇండోనేషియా ఒక విస్తారమైన ద్వీప సమూహం. 270 మిలియన్ల పైగా జనం ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ దేశం తరచుగా భూకంపాలకు గురౌతుంది. అంతేకాదు అగ్ని పర్వతాలు బద్దలు కావడం ఈ దేశంలో సర్వసాధారణం. రెండు రోజుల క్రితం కూడా ఇండోనేషియాలో భూకంపం వాటిల్లింది.
2022 నవంబర్ లో పశ్చిమ జావాలో 5.6 తీవ్రతతో భూకంపం సంబవించింది. ఈ భూకంపం కారణంగా 331 మంది మృతి చెందారు. 2018 నులవేసిలో భూకంపం కారణంగా సునామీ వాటిల్లింది. ఈ సునామీతో 4,300 మంది మృతి చెందారు. ఇండోనేషియాలో సంభవించిన భూకంపంలో అత్యధికంగా మరణించిన ఘటన ఇదే.
2004లో హిందూ మహసముద్రంలో అత్యంత శక్తివంతమైన భూకంపం వచ్చింది. ఈ భూకంపం తో సునామీ ఏర్పడింది. దీంతో 12 దేశాల్లో 2.30 లక్షల మందికి పైగా మరణించారు. ఈ ఘటనలో ఇండోనేషియాలోని అచే ఫ్రావిన్స్ లో అత్యధికులు మృతి చెందారు.