కెనడా రాజధాని ఒట్టావాలోని Parliament Hill వైపుకు వేలాది మంది నిరసనకారులు దూసుకొచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందుజాగ్రత్తగా ప్రధాని జస్టిన్ ట్రూడో, అతని కుటుంబ సభ్యులు రహస్య ప్రదేశానికి వెళ్లారు.

రెండేళ్ల నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని చోట్ల మాత్రం కోవిడ్ వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేయడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. తాజాగా కెనడా కోవిడ్ వ్యాక్సినేషన్‌ తప్పనిసరి చేస్తూ ఇచ్చిన ఆదేశాలు.. అనుహ్య పరిణామాలకు దారితీశాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళకు దిగారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) విధించిన కరోనా నిబంధనలను వ్యతిరేకిస్తూ Freedom Convoy పేరుతో ట్రక్కు డ్రైవర్లు కెనడా రాజధాని ఒట్టావాను చుట్టుముట్టారు. 

శనివారం ఒట్టావాలో వేలాది మంది ట్రక్కర్లు గుమిగూడి US సరిహద్దును దాటడానికి వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. ఒట్టావాలోని Parliament Hill వైపుకు వేలాది మంది నిరసనకారులు దూసుకొచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందుజాగ్రత్తగా ప్రధాని జస్టిన్ ట్రూడో, అతని కుటుంబ సభ్యులను రహస్య ప్రదేశానికి తరలించినట్టుగా పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. ప్రధానమంత్రి కార్యాలయం, అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టే ప్రమాదం ఉండంతో ఈ నిర్ణయం తీసుకన్నారు.

ఆందోళన విషయానికి వస్తే కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. కోవిడ్ నిబంధనలు ఎత్తివేయాలని కోరుతూ రాజధాని నగరంలోకి దూసుకొచ్చిన ట్రక్కర్లకు వేలాది మంది నుంచి మద్దతు లభించింది. నిరసనకారుల్లో వృద్దులు, పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది నిరసనకారులు ప్రముఖ యుద్ధ స్మారక చిహ్నంపై నృత్యం చేయడం కనిపించింది.

ఈ చర్యలను కెనడా సైనికాధికారి జనరల్ వేన్ ఐర్, కెనడా రక్షణ మంత్రి అనితా ఆనంద్ ఖండించారు. తీవ్రమైన శీతల వాతావరణ హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా వందలాది మంది నిరసనకారులు పార్లమెంటరీ ఆవరణలోకి రావడంతో.. ఈ ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారే అవకాశం ఉందని పోలీసులు అప్రమత్తమయ్యారు. 

‘జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని అపవిత్రం చేయడం చూసి నేను బాధపడ్డాను. కెనడియన్లు తరతరాలుగా స్వేచ్ఛా వాక్చాతుర్యం వంటి మన హక్కుల కోసం పోరాడారు, చనిపోయారు.. కానీ ఇందుకోసం కాదు. ఈ నిరసనల్లో పాల్గొన్నవారు సిగ్గుతో తలలు దించుకోవాలి’ అని జనరల్ వేన్ ఐర్ ట్వీట్ చేశారు. ‘ఈ రోజు మనం చూస్తున్న ప్రవర్తన ఖండించదగినది’ అని అనితా ఆనంద్ పేర్కొన్నారు. కెనడా కోసం పోరాడి మరణించిన వారి పట్ల గౌరవంగా వ్యవహరించాలని ఆమె కోరారు.