తానున్న ప్రాంతానికి కొద్ది మీటర్ల దూరంలోనే దాడులు జరిగాయని ఆమె చెప్పడం గమనార్హం. చాలా కొద్దిలో తాను ప్రాణాలతో బయటపడ్డానని ఆమె చెప్పారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ భారతీయ విద్యార్థి సైతం ఇటీవల ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంగతి మనకు తెలిసిందే. కాగా.. బెంగాల్ కి చెందిన ఓ విద్యార్థిని మాత్రం.. తృటిలో ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకుంది.
బెంగాల్ కి చెందిన షబ్నమ్ బేగం(19) అనే విద్యార్థిని ఉక్రెయిన్ లోని కార్కివ్ నేషనల్ మె డికల్ యూనివర్శిటీ లో వైద్య విద్య అభ్యసిస్తోంది. కాగా.. ఆమె ఉంటున్న ప్రాంతంలో బుధవారం రష్యా వైమానిక దాడులు చేసింది.
కాగా.. కైవ్లో ఉన్న భారతీయవిద్యార్థులందర్నీ వెంటనే ఖాళీ చేయాలన్న లక్ష్యంతో భారత రాయబార కార్యాలయం చాలామేరకు తరలించింది. సరిగ్గా.. తాను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి చేరుకునే సమయంలోనే అక్కడ వైమానిక దాడులు జరిగాయని.. తానున్న ప్రాంతానికి కొద్ది మీటర్ల దూరంలోనే దాడులు జరిగాయని ఆమె చెప్పడం గమనార్హం. చాలా కొద్దిలో తాను ప్రాణాలతో బయటపడ్డానని ఆమె చెప్పారు.
కాగా.. తన యూనివర్శిటీకి చెందిన భారత విద్యార్థి నవీన్ ముందు రోజు ప్రాణాలు కోల్పోయాడని ఆమె చెప్పారు. ఈ దాడుల్లో తన కాలికి గాయమైందని.. అయినప్పటికీ..ప్రాణాలతో బయటపడ్డానని ఆమె చెప్పారు.
‘‘ నేను మరణానికి చాలా దగ్గరగా వెళ్లాను. నా ముందే షెల్ వచ్చి పడింది. నేను కూడా రోడ్డు మీద పడిపోయాను. ఆ సమయంలో నాకు ఏమీ వినపడలేదు.. అంత పొగ కమ్మేసింది. ఉక్రెయిన్ సైనికులు వచ్చి నన్ను అక్కడి నుంచి తీసుకువెళ్లారు. నా స్నేహితులు చాలా మంది రోడ్డు మీద పడిపోయి ఉన్నారు. కొందరైతే రక్తపు మడుగులో పడి ఉన్నారు. నా కుడి కాలికి కూడా గాయమై రక్తం వచ్చింది. నేను కూడా బతుకుతాను అనుకోలేదు. కానీ బతికాను’’ అంటూ తన పరిస్థితిని వివరించింది.
దాడులు జరిగిన ప్రాంతం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరం వెళ్లినా.. మాకు అక్కడి మోతలు వినపడుతూనే ఉన్నాయని ఆమె చెప్పడం గమనార్హం. క్షేమంగా ఇంటికి చేరతాననే నమ్మకంతో ఉన్నానని ఆమె చెప్పారు.
