పవిత్ర స్థలంలో తొక్కిసలాట... 44మంది మృతి
ఉత్తర ఇజ్రాయిల్ లోని ఓ పవిత్ర స్థలానికి భక్తులు వేలాది సంఖ్యలో తరలి వెళ్లగా.. ఆ సమయంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 44 మంది మరణించినట్లు అక్కడి వైద్య సిబ్బంది తెలిపారు.
ఇజ్రాయిల్ లో ఘోరం జరిగింది. తొక్కిసలాట జరిగి దాదాపు 44మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర ఇజ్రాయిల్ లోని ఓ పవిత్ర స్థలానికి భక్తులు వేలాది సంఖ్యలో తరలి వెళ్లగా.. ఆ సమయంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 44 మంది మరణించినట్లు అక్కడి వైద్య సిబ్బంది తెలిపారు.
ఇంకా పదుల సంఖ్యలో యాత్రికుల ఆరోగ్యపరిస్థితులు విషమంగా ఉన్నాయని వివరించారు. మౌంట్ మెరాన్ సమీపంలోని రెండో శతాబ్దికి చెందిన రుషి రబ్బి షిమోన్ బార్ యోచై సమాధి దగ్గరకు ప్రతి ఏడాది యూదులు పెద్దమొత్తంలో వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. గతేడాది కరోనా కారణంగా ఇక్కడికి రావడాన్ని నిషేధించారు. ఈ సారి 10 వేల మంది రావడానికి అధికారులు అనుమతినిచ్చారు. కానీ, అందుకు మూడు రెట్ల మంది బస్సులో వచ్చి చేరారు.
దీంతో అధికారులు చేసిన ఏర్పాట్లు ఎంతమాత్రం సరిపోలేవు. ఈ తొక్కిసలాటకు ముందు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన సీటింగ్ కూలిపోయిందని రెస్క్యూ అధికారులు వివరించారు. కానీ, తర్వాతి ఆ వాదనను సవరిస్తూ తొక్కిసలాట జరిగిందని, అందులోనే పెద్దమొత్తంలో గాయపడ్డారని తెలిపారు. తొక్కిసలాట జరగడానికి అసలు కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదు. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
కనీసం ఆరు హెలికాప్టర్లు క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించే పనిలో పడ్డాయి. కొందరు వైద్యులు నేరుగా ప్రమాదస్థలికి వచ్చి చికిత్స అందిస్తున్నారు. ప్లాస్టిక్ బ్యాగులతో కవర్ చేసిన మృతదేహాల వరుసను స్థానిక మీడియా ప్రచురించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.. 93 లక్షల జనాభా గల ఇజ్రాయెల్ దాదాపు సగం మందికి సంపూర్ణంగా వ్యాక్సి్న్ ఇచ్చింది. అయినప్పటికీ.. సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. అయినప్పటికీ.. ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం అందరినీ కలవరపెడుతోంది.