కాబూల్లోని మిలిటరీ విమానాశ్రయంలో పేలుడు.. పలువురు మృతి..
ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లోని మిలిటరీ ఎయిర్ పోర్టు దగ్గర భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అనేక మంది చనిపోయారు. మరెంతో మందికి గాయాలు అయ్యాయి.
ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లోని సైనిక విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ విషయాన్ని ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. రాయిటర్స్, స్థానిక మీడియా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. కాబూల్లోని విమానాశ్రయం సమీపంలో ఆదివారం ఉదయం భారీ పేలుడు జరగడంతో అనేక మంది చనిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్ లు అక్కడికి చేరుకున్నాయి.
ఆఫ్ఘన్ రాజధాని 15వ జిల్లాలో ఉన్న ఈ విమానాశ్రయానికి సమీపంలో తాలిబన్ల అంతర్గత మంత్రిత్వ శాఖ భవనం కూడా ఉంది. ‘‘ఈ రోజు ఉదయం కాబూల్ మిలిటరీ విమానాశ్రయం వెలుపల పేలుడు సంభవించింది, దీని కారణంగా మా దేశానికి చెందిన అనేక మంది పౌరులు అమరులయ్యారు. అనేక మంది గాయపడ్డారు. ’’ అని మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ నఫీ టాకోర్ ‘రాయిటర్స్’కు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.