అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూఏఈకి మిలిటరీ పరంగా మరింత సహకారం ఇవ్వాలని నిర్ణయించింది. యూఏఈపై ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యూఏఈకి మద్దతుగా వార్షిప్లు, ఫైటర్ జెట్లను అమెరికా ప్రభుత్వం అక్కడికి పంపనుంది. ఇప్పటికే ఈ హౌతీ తిరుగుబాటుదారులను ఎదుర్కోవడానికి యూఏఈ, అమెరికా సంకీర్ణ సేనలు యూఏఈలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, నెల వ్యవధిలో హౌతీ తిరుగుబాటుదారులు యూఏఈపై మూడు సార్లు క్షిపణి దాడులు చేశారు.
దుబాయ్: అమెరికా(America) కీలక నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)కు మిలిటరీ పరంగా మరింత సహకారాన్ని అందించనున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ నుంచి మద్దతు ఉన్న కొన్ని హౌతీ తిరుగుబాటు (Iran backed Houthi Rebels) దారులు చేస్తున్న దాడులను యూఏఈ ఎదుర్కోవడానికే వార్ షిప్లు, ఫైటర్ జెట్లను పంపనున్నట్టు తెలిపింది. గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫైటర్ జెట్లనూ యూఏఈకి అమెరికా తరలించనుంది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం యూఏఈ ఎదుర్కొంటున్న సమస్యను అదిగమించడానికే ఈ సహకారం అని అమెరికా వెల్లడించింది. ఈ అంశంపై అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహయాన్లు ఫోన్లో మాట్లాడినట్టు యూఏఈలోని అమెరికా ఎంబసీ తెలిపింది. ఇప్పటికే ఇరాన్ మద్దతు ఇస్తున్న హౌతి రెబల్స్ను ఎదుర్కోవడానికి సౌదీ సంకీర్ణ సేనలు యూఏఈలో ఉన్నాయి. ఇందులో అమెరికా ఆర్మీ కూడా ఉన్నది. అయితే, ఇటీవలే హౌతీల నుంచి ముప్పు తీవ్రమైంది. నెల రోజుల వ్యవధిలోనే యూఏఈపై హౌతీ తిరుగుబాటుదారులు మూడు సార్లు క్షిపణి దాడులు(Missile Attacks) చేశారు.
గత నెల హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన తొలి మిస్సైల్ అటాక్లో ముగ్గురు ఆయిల్ వర్కర్లు మరణించారు. రెండో దాడి అల్ దఫ్రా ఎయిర్బేస్పై జరిగింది. ఇక్కడే అమెరికా సైన్యం ఉన్నది. హౌతీ తిరుగుబాటుదారుల దాడితో అమెరికా సైనికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే వారు వారి మిస్సైల్స్ను ఎదుర్కోవడానికి పేట్రియట్ ఇంటర్సెప్టర్ను ప్రయోగించారు.
అమెరికా పంపనున్న గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్ యూఎస్ఎస్ కోల్.. యూఏఈ నేవీతో సమన్వయంలోకి వెళ్లనుంది. అబుదాబిలో మోహరించి ఉండనుంది. అంతేకాదు, ఐదో తరం ఫైటర్ జెట్లను అమెరిా ఇక్కడ మోహరించనుంది. వీటితోపాటు ముందస్తుగానే దాడుల గురించి అప్రమత్తం చేసే ఇంటెలిజెన్స్ హెచ్చరికల సమాచారాన్ని అందించనున్నట్టు అమెరికా తెలిపింది.
ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని Abu Dhabiలో తిరుగుబాటుదారులు జరిపిన Missile attackలో ఇద్దరు భారతీయులతో సహా ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన యూఏఈ ప్రభుత్వ స్థానికంగా నెలరోజులపాటు drones, Light sports aircraft కార్యకలాపాలను నిషేధిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అంతర్గత వ్యవహారాల శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమిరేట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇటీవల జరిగిన దాడుల గురించి నేరుగా ప్రస్తావించకుండా నిషేధిత ప్రాంతాల్లోనూ డ్రోన్ లను ఎగురవేస్తూ, వాటిని దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించామని.. ఈ నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశామని శాఖ తెలిపింది. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు అబుదాబి దాడుల తర్వాత యెమన్, సౌదీ అరేబియా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియా సంకీర్ణ దళాలు.. హుతీ తిరుగుబాటుదారుల ఆధీనంలోని రాజధాని సనాపై జరిపిన వైమానిక దాడుల్లో పదకొండు మంది మృతి చెందారు.
