ఆ యూనివర్సిటీలో కాల్పులు.. 8 మంది మృతి... బిల్డింగ్ కిటికీల్లోంచి కిందకు దూకిన విద్యార్థులు
ఓ స్టూడెంట్ గన్ పట్టుకుని యూనివర్సిటీలోకి వెళ్లి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. రష్యాకు చెందిన పెర్మ్ యూనివర్సిటీలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదారుగురు గాయపడ్డారు. కాల్పుల నుంచి తప్పించుకోవడానికి కొందరు విద్యార్థులు వర్సిటీ భవంతుల కిటికీల్లో నుంచి కిందికి దూకారు.
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఉగ్రవాద చర్యలు పెరుగుతున్నాయి. తాజాగా, రష్యాలో ఓ వ్యక్తి గన్ చేతబూని యూనివర్సిటీలోకి వెళ్లి విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు కనీసం ఐదుగురు మరణించారు. మరో ఐదారుగురు తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. కాల్పుల శబ్దం వినగానే ఉపాధ్యాయులు, విద్యార్థులు క్లాస్రూమ్లు, ఆడిటోరియం హాల్, ఇతర గదుల్లో తలుపులు వేసుకుని లాక్ చేసుకున్నారు. కాగా, ఇంకొందరు విద్యార్థులు వర్సిటీ బిల్డింగ్ కిటికీల్లో నుంచి కిందికి దూకి సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టారు. రష్యాలోని పెర్మ్ క్రాయి రీజియన్లోని పెర్మ్ స్టేట్ యూనివర్సిటీ(పీఎస్యూ)లో ఘటన చోటుచేసుకుంది.
ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ప్రమాదకరమైన ఆయుధాలతో యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యాడు. లోపలికి వెళ్లాక కొంతసేపటికి విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు విద్యార్థులు మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా అదే యూనివర్సిటీ స్టూడెంట్ అని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ ధ్రువీకరించింది.
గాయపడినవారిలో కొందరు బిల్డింగ్ నుంచి దూకినవారూ ఉన్నారని రీజినల్ హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది. కాల్పులతోపాటు బుల్లెట్ గాయాల నుంచి తప్పించుకోవడానికి బిల్డింగ్ పై నుంచి దూకేయడంతో నేరుగా నేలపై పడ్డారు. ఈ క్రమంలోనే పలువురు గాయపడ్డారు.
రష్యాలో పౌరులు గన్ వినియోగించడంపై కఠిన నిబంధనలున్నాయి. కానీ, సెల్ఫ్ డిఫెన్స, ఇతర కొన్ని కేటగిరీల్లో మాత్రం మినహాయింపు ఉన్నది. అందుకు కఠిన పరీక్షలు ఉంటాయి. వాటి తర్వాతే గన్ కలిగి ఉండటానికి అనుమతి ఉంటుంది.