కాలిఫోర్నియాలో కాల్పులు: నలుగురు మృతి, ఆరుగురికి గాయాలు
అమెరికా కాలిఫోర్నియాలో కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికా దేశంలోని కాలిఫోర్నియాలోని ఓ ఇంట్లో పార్టీ చేసుకొంటున్న బృందంపై గుర్తు తెలియని దుండగులు ఆదివారం నాడు రాత్రి కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందాడు.
లాస్ ఏంజిల్స్కు ఉత్తరాన 320 కి.మీ దూరంలో ఉన్న ఫ్రెస్నోలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలిఫొర్నియాలోని ఓ స్నేహితుల బృందం తమ బంధువులతో కలిసి గెట్ టు గెదర్ పార్టీని జరుపుకొంటున్న సమయంలో దుండగులు ఈ కాల్పులు జరిపారు.
ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో ఇంట్లో మొత్తం 35 మంది సభ్యులు ఉన్నారు.. అయితే ముగ్గురు ఘటనాస్థలిలోనే మరణించారు.మరొకరు ఆస్పత్రిలో మృతిచెందినట్లు వెల్లడించారు. ఇక మిగిలిన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లుగా పోలీసులు చెప్పారు. దాడికి తెడబడ్డ నిందితులు తమకు పరిచయం లేని వ్యక్తులని బాధితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. నిందితుల ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. అసలు నిందితులు ఎందుకు కాల్పులకు పాల్పడ్డారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.అమెరికాలో ఈ తరహా ఘటనలు తరచూ చోటు చేసుకొంటున్నాయి.