నేపాల్లో రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయుల దుర్మరణం..
నేపాల్లోని బాగ్మతి ప్రావిన్స్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
నేపాల్లోని బాగ్మతి ప్రావిన్స్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బాగ్మతి ప్రావిన్స్లో సింధులి జిల్లాలో మారుమూల ప్రాంతంలో కారు లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం అర్థరాత్రి ఐదుగురు భారతీయులు ప్రయాణిస్తున్న కారు బాగ్మతి ప్రావిన్స్లోని సింధులి జిల్లాలో అదుపు తప్పి రోడ్డు నుంచి 500 మీటర్ల దూరంలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా తెలిపింది. మృతిచెందిన నలుగురు పురుషులేనని.. వారి ఎవరనేది ఇంకా గుర్తించాల్సి ఉందని పేర్కొంది.
బీహార్ రిజిస్ట్రేషన్తో ఉన్న కారు తూర్పు ప్రాంతం నుంచి ఖాట్మండుకు వెళుతుండగా.. అది పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజ్ కుమార్ సిల్వాల్ తెలిపారు. ఇంకో వ్యక్తిని సింధూలీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా చెప్పారు. తీవ్రంగా గాయపడిన ప్రాణాలతో బయటపడిన మరో వ్యక్తికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుందని తెలిపారు.
ఇక, ప్రమాదం జరిగిన స్థలంలోని భౌగిళిక పరిస్థితుల దృష్ట్యా.. అక్కడి నుంచి మృతుల మృతదేహాలను వెలికితీయడంలో జాప్యం జరుగుతుంది. ‘‘ప్రమాద స్థలానికి చేరుకోవడానికి గంటకు పైగా సమయం పడుతుంది. మృతదేహాలను బయటకు తీయడంలో ఇబ్బంది ఉంది’’ అని ఎస్పీ రాజ్ కుమార్ సిల్వాల్ చెప్పారు.