హైదరాబాదులో మిత్రుడి ఘాతుకం: లేడీ టెక్కీపై అత్యాచారం
హైదరాబాదులోని నిజాంపేటలో ఓ సాఫ్ట్ ఇంజనీరుపై మిత్రుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న లేడీ టెక్కీపై మిత్రుడు అత్యాచారం చేసి పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరో నీచమైన ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీరుపై మిత్రుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాదులోని నిజాంపేటలో చోటు చేసుకుంది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి తన సోదరితో కలిసి నిజాంపేట ఈశ్వర్ విలాస్ రోడ్డులోని ఓ అపార్టుమెంటులో అద్దెకు ఉంటోంది. ఆమెకు జాయల్ చంద్ (27) అనే మిత్రుడు ఉన్నాడు. శనివారం మధ్యాహ్నమ ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి వద్దకు వచ్చాడు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై జాయల్ చంద్ అత్యాచారం చేసి పారిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన యువతి సోదరి చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
బాధితురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని సికింద్రబాదులోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.