ఆ కుక్కకున్న విలువ కూడ ప్రజలకు లేదా: కేసీఆర్ పై విజయశాంతి ఫైర్
సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట్లో కుక్క ప్రాణాలకు ఉన్న విలువ తెలంగాణ ప్రజలకు లేదని సినీ నటి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి విమర్శలు చేశారు.
విజయశాంతి తన ఫేస్బుక్ లో ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. తెలంగాణలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా కూడ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. కానీ, కేసీఆర్ ఇంట్లో కుక్కకు జ్వరం వచ్చి చనిపోతే డాక్టర్లపై కేసులు పెట్టారనే వార్తలు చూసి తెలంగాణ సమాజం ఆశ్చర్యపోతోందన్నారు.
విషజ్వరాల బారినపడి తెలంగాణలో ప్రజలు చనిపోతున్నా కనీస జాగ్రత్తలు తీసుకోని ఆరోగ్యశాఖాధికారులపై చర్యలు లేవని ఆమె విమర్శించారు. గ్లోబరీనా సంస్థకు ఇంటర్ పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పజెప్పి ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పుకు చాలా మంది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయినా కూడ ఇందుకు బాధ్యులైనవారిపై ఎలాంటి చర్యలు తీసుకోని విషయాన్నిఆమె గుర్తు చేశారు.
కేసీఆర్ కుటుంబం ప్రేమగా పెంచుకొన్న కుక్క చనిపోతే ఆ కుక్కకు వైద్యం చేసిన డాక్టర్ రంజిత్ పై కేసు పెట్టినట్టు వచ్చిన వార్తను చూసి తెలంగాణ సమాజం నివ్వెరపోయిందన్నారు.