పీఎసీ ఛైర్మెన్ పయ్యావుల కేశవ్కు బాబు పరామర్శ
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీఎసీ చైర్మెన్ పయ్యావుల కేశవ్ ను పరామర్శించారు.
హైదరాబాద్: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పీఎసీ ఛైర్మెన్ పయ్యావుల కేశవ్ ను టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సోమవారం నాడు ఉదయం హైద్రాబాద్లో పరామర్శించారు.
అమరావతిలో ఇటీవల పీఎసీ చైర్మెన్ పయ్యావుల కేశవ్ అనారోగ్యానికి గురయ్యాడు. మెరుగైన చికిత్స కోసం పయ్యావుల కేశవ్ హైద్రాబాద్ లోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
సోమవారం నాడు ఉదయం చంద్రబాబు నాయుడు, టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణలు పరామర్శించారు. పయ్యావుల కేశవ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. కేశవ్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్లతో కూడ చంద్రబాబునాయుడు మాట్లాడారు. కేశవ్ ఆరోగ్య పరిస్థితిని గురించి చంద్రబాబు వాకబు చేశారు.
కేశవ్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబునాయుడు ఆకాంక్షను వ్యక్తం చేశారు. కేశవ్ త్వరగా కోలుకోవాలని తాను కోరుకొంటున్నట్టుగా చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.