కేసీఆర్, చాడ వెంకట్ రెడ్డి భేటీ వెనుక అంతర్యం ఇదేనా?
రెండు రోజుల క్రితం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో సీఎం కేసీఆర్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల విషయమై సీపీఐ నేతతో కేసీఆర్ మాట్లాడారనే చర్చ సాగుతోంది
రెండు రోజుల క్రితం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో సీఎం కేసీఆర్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల విషయమై సీపీఐ నేతతో కేసీఆర్ మాట్లాడారనే చర్చ సాగుతోంది. అయితే ఈ విషయమై తమ మధ్య ఎలాంటి చర్చ సాగలేదని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఆకస్మాత్తుగా వీరిద్దరి మధ్య భేటీపై రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.
గత మాసంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీహార్ అసెంబ్లీతో పాటు దుబ్బాక అసెంబ్లీ స్థానానికి కూడ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.
ఈ ఉప ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్, బీజేపీలు కూడ ఇప్పటికే కసరత్తు చేస్తున్నాయి. టీజెఎస్ కూడ పోటీ చేయాలని భావిస్తోంది. సోలిపేట రామలింగారెడ్డి కుటుంబం నుండి ఎవరికో ఒకరికి ఎమ్మెల్యే టిక్కెట్టును కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
కొత్త రెవిన్యూ బిల్లు విషయమై చర్చించే పేరుతో సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటర్ రెడ్డితో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిలు కలిసి భోజనం చేశారు. రెవిన్యూ బిల్లు గురించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శితో చర్చించినట్టుగా స్వయంగా అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు.
అయితే దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల విషయంలో వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో కూడ సీపీఐ మద్దతు కోసం టీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతోంది.
ఈ సమ్మెకు సీపీఐ అనుబంధ కార్మికసంఘమైన ఎంప్లాయిస్ యూనియన్ కీలక పాత్ర పోషిస్తోంది. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వలేదు.
తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలనే విషయమై పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొంటామని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు.దుబ్బాక ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ విషయమై నిర్ణయం తీసుకొంటామని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ తెలిపారు.
హుటాహుటిన సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డితో కేసీఆర్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. సీఎం కేసీఆర్ తో చాడ వెంకట్ రెడ్డి సమావేశం కావడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని నారాయణ తేల్చి చెప్పారు.
సోలిపేట రామలింగారెడ్డి కొందరి మాటలను విని తమను నిర్లక్ష్యం చేశారని పార్టీలో కొందరు నేతలు అసమ్మతి రాగం విన్పించారు. అసమ్మతి నేతల వ్యవహారం టీఆర్ఎస్ కు తలనొప్పి తెచ్చిపెట్టింది.ఈ తరుణంలో మద్దతు కోరడానికి చాడ వెంకట్ రెడ్డితో కేసీఆర్ భేటీ అయ్యారనే ప్రచారం కూడ లేకపోలేదు.