బిజెపికి కేసీఆర్ చెక్: కరీంనగర్ జిల్లాకు పెద్ద పీట
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి వర్గ విస్తరణలో కేసీఆర్ పెద్ద పీట వేశారు. బీజేపీని రాజకీయంగా ఎదుర్కొనేందుకు కరీంనగర్ జిల్లాకు మంత్రివర్గంలో కేసీఆర్ పెద్దపీట వేసినట్టుగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నెల 8వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి నలుగురికి కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. గతంలో ఈ జిల్లా నుండి కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్కు అవకాశం కల్పించారు.
మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్తో పాటు గంగుల కమలాకర్ కు చోటు కల్పించారు. బీజేపీ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు టీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాత్మకంగా ఈ జిల్లా నుండి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చింది.
గత టర్మ్లో ఈ జిల్లా నుండి కేటీఆర్, ఈటల రాజేందర్లకు మాత్రమే మంత్రి పదవి దక్కింది. ఈ దఫా మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి నలుగురికి మంత్రిపదవులు దక్కాయి.
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధి బోయినపల్లి వినోద్ కుమార్ ఓటమి పాలయ్యాడు. వినోద్కుమార్ పై బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ విజయం సాధించాడు.
గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ టీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యాడు. కానీ కరీంనగర్ ఎంపీ స్థానంలో మాత్రం విజయం సాధించాడు.
కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్ ఎంపీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం టీఆర్ఎస్ కు తీవ్ర దెబ్బే. నిజామాబాద్, కరీంనగర్ ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ కీలక నేతలు ఓటమి పాలయ్యారు. నిజామాబాద్ నుండి పోటీ చేసిన కవిత, కరీంనగర్ నుండి వినోద్ కుమార్ లు ఓడిపోవడం టీఆర్ఎస్ నాయకత్వానికి మింగుడుపడలేదు.
ఈ తరుణంలో టీఆర్ఎస్ నాయకత్వం నష్టనివారణ చర్యలకు పూనుకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీకి చెక్ పెట్టేందుకు గాను మరో ఇద్దరికి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పించారు.
కరీంనగర్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలైన వినోద్ కుమార్ కు కూడ ప్లానింగ్ వైస్ ఛైర్మెన్ పదవిని కట్టబెట్టారు. వినోద్కుమార్ కు కేబినెట్ ర్యాంకును కట్టబెట్టారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఐదు మంత్రి పదవులు దక్కినట్టైంది.
కరీంనగర్ జిల్లాలో బీజేపీ బలోపేతం అవుతుందని భావించి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలోనే ఇతర పార్టీలకు చెందిన నేతలు కొందరు బీజేపీలో చేరారు. భవిష్యత్తులో బీజేపీని ఎదుర్కొనేందుకు గాను పార్టీ నేతలకు నామినేటేడ్ పదవులు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. త్వరలోనే నామినేటేడ్ పదవులను కూడ భర్తీ చేయనున్నారు