గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు: టీఆర్ఎస్ ప్లాన్ ఇదీ.....
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఆ తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాదిలో జరిగే ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ఇప్పటి నుండే కసరత్తును ప్రారంభించింది.
గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఆ పార్టీ బరిలోకి దింపిన దేవీప్రసాద్ ఓటమి పాలయ్యాడు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధి రామచంద్రారావు విజయం సాధించారు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానంనుండి టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. ఈ దఫా జరిగే ఎన్నికల్లో మరోసారి ఈ స్థానం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి బరిలోకి దింపనుంది.
హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుండి జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
2017 లోపు డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికే ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. నవంబర్ 6వ తేదీ వరకు ఓటు నమోదు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. దీంతో కొత్తగా ఓట్లు నమోదు చేసుకొన్నవారిపై టీఆర్ఎస్ నాయకత్వం దృష్టి పెట్టింది.
2014 తర్వాత డిగ్రీ పూర్తి చేసిన వారిపై గులాబీ దళం కేంద్రీకరించింది. వీరిలో మెజారిటీ ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాన్ని సాధించవచ్చని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.
ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ రెండు స్థానాల పరిధిలోని మంత్రులు,ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశమయ్యారు.
మంత్రులు, ఎమ్మెల్యేలకు ఓటరు నమోదులో టీఆర్ఎస్ నాయకత్వం టార్గెట్ విధించింది. ఈ టార్గెట్ ను చేరుకొనేందుకు గాను మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు ఓటరు నమోదు కార్యక్రమంలో జోరుగా పాల్గొంటున్నారు.ఆయా నియోజకవర్గాలకు టీఆర్ఎస్ నాయకత్వం ఇంచార్జీలను నియమించింది.
హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ ఘోరంగా ఓటమి పాలైంది. ఈ రెండు స్థానాల్లో ఓటమికి కారణాలను టీఆర్ఎస్ నాయకత్వం విశ్లేషించింది. ఈ దఫా ఆ తరహా తప్పిదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను చర్యలు తీసుకొంది.
ఇందులో భాగంగానే కొత్త ఓటర్లపై కేంద్రీకరించింది.
హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం నుండి మరోసారి పోటీ చేస్తానని ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రకటించారు. గతంలో ఆయన ఈ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. బొంతు రామ్మోహన్ తో పాటు మరికొందరి పేర్లను కూడ టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.