Special Holiday : తెలంగాణలో ప్రత్యేక సెలవు ... వరుసగా రెండ్రోజులు హాలిడేలే
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపు (శనివారం) సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రత్యేక సెలవును ప్రకటించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Telangana Holidays
Telangana Holiday : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ముస్లింల ఎంతో పవిత్రంగా భావించే షబ్ ఎ బరాత్ సందర్భంగా ఇవాళ (ఫిబ్రవరి 14న) ఆప్షనల్ హాలిడే ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వరుసగా రేపు, ఎల్లుండి (ఫిబ్రవరి 15,16) కూడా సెలవులు వస్తున్నాయి. రేపు శనివారం గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక లీవ్ ను ప్రకటించింది రేవంత్ సర్కార్.
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే గిరిజన ఉద్యోగులకు సేవాలాల్ జయంతి సందర్భంగా స్పెషల్ క్యాజువల్ లీవ్ తీసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. గిరిజనవర్గాల నుండి వస్తున్న డిమాండ్ ను పరిశీలించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా సేవాలాల్ జయంతికి ఇలాగే గిరిజన ఉద్యోగులకు సాధారణ లీవ్ మంజూరు చేసామని ప్రభుత్వం గుర్తుచేసింది.
గిరిజన సామాజికవర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సేవాలాల్ జయంతిని ఘనంగా జరుపుకునేందుకు ఈ క్యాజువల్ లీవ్ ను ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు గిరిజన ఉద్యోగులకు లీవ్ మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక జీవోను జారీ చేసారు సీఎస్ శాంతికుమారి.
ఫిబ్రవరి 15న ప్రత్యేక సెలవు :
తెలంగాణలో బంజారా ప్రజలు ఎక్కువగానే ఉంటారు. ప్రత్యేకంగా గిరిజనులు మాత్రమే నివాసముండే అనేక తండాలు తెలంగాణవ్యాప్తంగా ఉన్నాయి. ఈ గిరిజన ప్రజలు సంత్ సేవాలాల్ ను ఆరాధిస్తుంటారు. ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతి... కాబట్టి ఈరోజును గిరిజనులంతా పండగలా భావిస్తారు. సేవాలాల్ ను ఆరాధిస్తూ ప్రత్యేక కార్యక్రమాలను చేపడతారు.
గతేడాది తెలంగాణ ప్రభుత్వం సేవాలాల్ జయంతిన గిరిజన ఉద్యోగులకు ప్రత్యేక హాలిడే ఇచ్చింది. కానీ ఈసారి అలాకాకుండా పూర్తి హాలిడేగా ప్రకటించాలని గిరిజనులు ముందునుండి డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు, యువత కూడా సేవాలాల్ జయంతిలో పాల్గొనేలా స్కూళ్ళు, కాలేజీలకు కూడా సెలవు ప్రకటించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేసాయి. కానీ ప్రభుత్వం మాత్రం గిరిజన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించింది.
సేవాలాల్ జయంతిని ప్రతి బంజారా గ్రామం, తండాలో ఘనంగా జరుపుకుంటారు... ఆరోజు మహాభోగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో బంజారాలు భారీ సంఖ్యలో పాల్గొంటారు... పిల్లలు, యువత కూడా పాల్గొంటారు. కాబట్టి ఫిబ్రవరి 15న ఉద్యోగులకే కాదు గిరిజన విద్యార్థులకు సెలవు ఇవ్వాలని బంజారా ఉద్యోగ, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. కానీ ప్రభుత్వం మాత్రం గిరిజన ఉద్యోగులకే సెలవు ప్రకటించింది.
అయితే గిరిజన విద్యార్థులు ఎక్కువగా వుండే విద్యాసంస్థల్లో సేవాలాల్ జయంతిని జరపనున్నారు. ఇందుకోసం స్థానిక విద్యాశాఖ అధికారులే నిర్ణయం తీసుకోనున్నారు. సేవాలాల్ జయంతి రోజు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే గిరిజన విద్యాసంస్థలకు ఆదేశాలు అందాయి. శనివారం విద్యాసంస్థల్లో ఈ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
వరుసగా ఫిబ్రవరి 14,15,16 సెలవులు :
ముస్లి మైనారిటీ ఉద్యోగులతో పాటు విద్యాసంస్థలకు ఇవాళ షబ్-ఎ-బరాత్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే లభించింది. ఇక రేపు సేవాలాల్ జయంతి సందర్భంగా గిరిజన ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ లభిస్తోంది. ఎల్లుండి ఫిబ్రవరి 16న ఆదివారం... సాధారణంగా ఉద్యోగులు, విద్యార్థులు అందరికీ సెలవు వుంటుంది. ఇలా వరుసగా మూడురోజులు కొందరు ఉద్యోగులు, విద్యార్థులకు సెలవు వస్తోంది.
ఇక ఫిబ్రవరి 26, 27 న మరో రెండు సెలవులు రానున్నాయి. ఫిబ్రవరి 26న శివరాత్రి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా సెలవు ప్రకటించింది. ఫిబ్రవరి 27న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వుంది. కాబట్టి ఆరోజు కూడా సెలవు వుండనుంది. ఇలా ఈ నెలలో అనుకోకుండా వరుస సెలవులు వస్తునే వున్నాయి.