RTC: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మగవారికి గుడ్ న్యూస్.. ఇక ఆ సమస్య తీరినట్లే
సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు గాను ఇప్పటి వరకు పలు ప్రయోగాత్మక నిర్ణయాలు తీసుకున్న సజ్జనార్ తాజాగా మరో ముందడుగు వేశారు. ఇంతకీ ఏంటా నిర్ణయం.? దీంతో కలిగే ప్రయోజనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహా లక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. పల్లెవెలుగుతో పాటు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఈ అవకాశాన్ని కల్పించారు. దీంతో పురుషులకు ఇబ్బందిగా మారిందనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఓవైపు కూర్చోవడానికి సీటు లభించకపోవడం మరో వైపు చిల్లర సమస్య కూడా పెరిగింది.
బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడంతో పురుషులు ప్రయాణించే సమయంలో చిల్లర సమస్య ఎక్కువైంది. అయితే దీనికి పరిష్కారం అన్నట్లుగానే తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి చిల్లర సమస్య లేకుండా యూపీఐ పేమెంట్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సేవలను త్వరలోనే రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
సరిపడ చిల్లర లేక కండక్టర్లు బస్సులో నుంచి దించేసిన సందర్భాలు ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనే ఉంటాం. అదే విధంగా టికెట్పై రాసిన చిల్లరను మర్చిపోయిన వారు కూడా ఉంటారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకే యూపీఐ పేమెంట్స్ను తీసుకొచ్చారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక మిషిన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మిషిన్ సహాయంతో ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్లాలో ఎంటర్ చేయగానే మిషిన్ స్క్రీన్పై క్యూ ఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది. ప్రయాణికులు ఎంచక్కా స్కాన్ చేసి ఫోన్తో పేమెంట్స్ చేస్తే సరిపోతుంది.
కొన్ని సమస్యలు..
అయితే ప్రస్తుతం ఈ విధానం ద్వారా సిటీ బస్సుల్లో కొన్ని సమస్యలు వస్తున్నట్లు కండక్టర్లు చెబుతున్నారు. స్టాపులు దగ్గర దగ్గరగా ఉండడంతో బస్సులో రద్దీ ఎక్కువగా ఉండడం కారణంగా స్కానింగ్ చేయడం ఆలస్యం అవుతుందని అంటున్నారు. అలాగే బస్సులో సిగ్నల్ సరిగా లేకపోవడం వల్ల కూడా పేమెంట్ ఆలస్యమవుతుందని అంటున్నారు. మంచి సిగ్నల్ ఉండే సిమ్లు ఇస్తే సమస్య తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
Students bus pass
భవిష్యత్తులో మరిన్ని సేవలు..
ఇదిలా ఉంటే ఆర్టీసీ భవిష్యత్తులో మరిన్ని డిజిటల్ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని బస్సుల్లో స్వైపింగ్ మిషిన్స్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో బస్ పాస్ను కూడా మొబైల్లో చూపించే రోజులు రానున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు బస్పాస్ రెన్యూవల్ కోసం ప్రతీ నెల సంబంధిత సెంటర్ల వద్ద నిలబడాల్సి వస్తుంది. అయితే ఆన్లైన్లో పాస్ పొందే అవకాశాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆర్టీసీ ప్రత్యేక యాప్ను తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం.