ఎపిలో తలదాచుకున్న రవిప్రకాష్, శివాజీ: లుకవుట్ నోటీసులు జారీ
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీల కోసం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు లుక్ ఔట్ సర్య్కులర్ జారీ చేశారు.
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీల కోసం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు లుక్ ఔట్ సర్య్కులర్ జారీ చేశారు. ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నామని, విచారణకు హాజరుకాలేమని రవిప్రకాశ్, శివాజీ సైబర్ క్రైం పోలీసులకు సమాచారం పంపించిన విషంయ తెలిసిందే. తనకు విచారణకు హాజరయేందుకు మరో 10 రోజులు గడువు కావాలని రవిప్రకాష్, శివాజీ కోరారు. రవిప్రకాశ్, శివాజీలు పంపిన ఈ-మెయిల్స్ పై సంతృప్తి చెందని పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేశారు
ఫోర్జరీ కేసులో చిక్కుకున్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరంచేశారు. గత రెండు రోజులుగా కొన్ని బృందాలు రవిప్రకాశ్ ఆచూకీ కోసం గాలిస్తున్నాయని, శుక్రవారం నుంచి మరో రెండు బృందాలు రంగంలోకి దిగాయని సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు అంటున్నారు. అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్రావు ఫిర్యాదుమేరకు ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సైబరాబాద్ పోలీసులు పలు నోటీసులు పంపినా రవిప్రకాష్ పోలీసుల ముందుకు రావడం లేదు
ఏపీలోని కీలక రాజకీయనేతల అండతో ఆయన అక్కడే ఆశ్రయం పొందారనే అనుమానంతో ఆ దిశగా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారని సమాచారం. ఈ కేసులో కీలకం రవిప్రకాశ్ కాబట్టి తొలుత ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, మరోవైపు తగిన ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు అంటున్నారు.
కేసులో మరో నిందితుడు శివాజీకి సైతం సీఆర్పీసీ 41 కింద నోటీసులు జారీచేసే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ మధ్య షేర్ల కొనుగోలు ఒప్పందం నకిలీదని నిరూపించే కొన్ని ఆధారాలను సేకరించిన సైబర్క్రైం పోలీసులు మరిన్ని సాంకేతిక ఆధారాల కోసం శోధిస్తున్నారు
కేసుకు సంబంధించిన పలు కీలకఫైళ్లు, ఇతర లావాదేవీల సమాచారం అంతా పలు డివైజ్లలో ఉండటంతో వాటిని వెలికితీసే పనిలో ఉన్నారు. బంజారాహిల్స్లోని టీవీ9 కార్యాలయం, రవిప్రకాశ్తోపాటు, శివాజీ, ఎంకేవీఎన్ మూర్తి ఇండ్లల్లో నిర్వహించిన సోదాల్లో పలు డాక్యుమెంట్లను సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
వీటిలో ప్రధానంగా టీవీ9 కార్యాలయం నుంచి 12 హార్డ్డిస్క్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు వాటిల్లోంచి ఏ సమాచారాన్ని డిలిట్చేశారు. అందులోని సమాచారాన్ని ఇంకెవరికి పంపారన్న కోణంలో సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నట్టు తెలిసింది.
టీవీ9 కొనుగోలు డీల్ నిలిపివేయాలంటూ నటుడు శివాజీ దాఖలుచేసిన పిటిషన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం మరో కేసులో సైతం ఆయనకు భంగపాటు తప్పలేదు. టీవీ9 పాత యాజమాన్యానికి, సైఫ్మారిషస్ ఫైనాన్స్ కంపెనీకి మధ్య వాటాల కొనుగోలు వ్యవహారంపై నడుస్తున్న కేసులో తనను కూడా ఇంప్లీడ్చేయాలని శివాజీ గతంలో దాఖలుచేసిన పిటిషన్ను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది.
తాను కూడా టీవీ9లో భాగస్వామినేనని శివాజీ ఎలాంటి ఆధారాలు చూపించకుండా కోర్టును తప్పుదోవ పట్టించాడంటూ ఇంప్లీడ్ పిటిషన్ను తిరస్కరించింది. కాగా, టీవీ9 పాత యాజమాన్యం, సైఫ్మారిషస్ ఫైనాన్స్ కంపెనీకి మధ్య షేర్ల కొనుగోలుకు సంబంధించి తొలుత ఓ ఒప్పందం కుదిరింది.
ఆ తర్వాత దానిని రద్దుచేసుకోవడంపై టీవీ9 పాత యాజమాన్యంపై సైఫ్మారిషస్ కంపెనీ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. దీనిపై వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా సైఫ్మారిషస్ ఫైనాన్స్ కంపెనీకీ, పాత టీవీ9 యాజమాన్యానికి మధ్య మరో ఒప్పందం కుదిరినట్టు సమాచారం.
సైఫ్మారిషస్కు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించేందుకు టీవీ9 పాత యాజమాన్యం అంగీకరించినట్టు తెలిసింది. సైఫ్మారిషస్ ఫైనాన్స్ కంపెనీ, టీవీ9 పాత యాజమాన్యానికి సంబంధించిన కేసులో తుది తీర్పును ఈ నెల 24న వెలువరిస్తామని ఎన్సీఎల్టీ ప్రకటించింది.