షర్మిలకు కుడి ఎడమల: ఎవరీ కొండా రాఘవరెడ్డి ?
తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. వైఎస్ షర్మిల ఈ ఏడాది మార్చిలో పార్టీని ప్రారంభించే అవకాశాలున్నట్టుగా ప్రచారం సాగుతోంది. చేవేళ్లలో ఆమె పార్టీని ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణకే షర్మిల పార్టీ పరిమితం కానుంది. షర్మిలకు కొండా రాఘవరెడ్డి ప్రధాన మద్దతుదారుడిగా ఉన్నాడు. ఈ పార్టీ విషయంలో రాఘవరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల మంగళవారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏర్పాటులో రాఘవరెడ్డి కీలకపాత్ర పోషించారు. త్వరలోనే ఇతర జిల్లాలకు చెందిన నేతలతో కూడ షర్మిల సమావేశం కానున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పెద్ద మంగలారం గ్రామానికి చెందిన కొండా రాఘవరెడ్డి షర్మిల పార్టీతో నడవనున్నారు.
పెద్దమంగలారం గ్రామానికి కొండా రాఘవరెడ్డి తండ్రి చెన్నారెడ్డి సుమారు మూడు పర్యాయాలు సర్పంచ్ గా పనిచేశారు. రాఘవరెడ్డి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు.చేవేళ్ల రాజకీయాల్లో రాఘవరెడ్డి కీలకంగా వ్యవహరించారు.
రాఘవరెడ్డి బంధువుల అమ్మాయిని మర్రి చెన్నారెడ్డి వివాహం చేసుకొన్నాడు. దీంతో మర్రి చెన్నారెడ్డితో కూడ రాఘవరెడ్డికి మంచి సంబంధాలున్నాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి మర్రి చెన్నారెడ్డి సీఎంగా చివరిసారి కొనసాగిన సమయంలో ఆయన పీఏగా రాఘవరెడ్డి పనిచేశారు.
ఈ సమయంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కొండా రాఘవరెడ్డికి పరిచయం ఏర్పడింది. వైఎస్ఆర్ రాఘవరెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఆ తర్వాత కొనసాగాడు.
మాజీ మంత్రి ఇంద్రారెడ్డి టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరే సమయంలో వైఎస్ఆర్ తో చర్చల ప్రక్రియలో రాఘవరెడ్డి కీలకంగా వ్యవహరించారు.
కారు ప్రమాదంలో ఇంద్రారెడ్డి మరణించిన తర్వాత చేవేళ్ల అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరిగాయి.ఆ సమయంలో టీడీపీలో చేరాలని సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం అందింది.
ఒకవేళ ఆ సమయంలో సబితా ఇంద్రారెడ్డి టీడీపీలో చేరి పోటీ చేస్తే చేవేళ్ల నుండి కొండా రాఘవరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగేవాడు. ఈ మేరకు ఆ సమయంలో వైఎస్ఆర్ ప్లాన్ చేశాడు. కానీ సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగారు
ఎంత మంది ఉన్నా కూడ రాఘవరెడ్డి వచ్చినట్టుగా సమాచారం అందిస్తే ఐదు నిమిషాల్లో వైఎస్ఆర్ రాఘవరెడ్డిని కలిసేవాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాఘవరెడ్డి టీఆర్ఎస్ లో చేరారు.
కొండా వెంకటరంగారెడ్డికి రాఘవరెడ్డి కుటుంబానికి కూడ బంధుత్వం ఉంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాత, రాఘవరెడ్డి తాతలు సోదరులు.
టీఆర్ఎస్ లో కూడ రాఘవరెడ్డి కీలకంగా వ్యవహరించారు. కొన్ని కారణాలతో కొండా రాఘవరెడ్డి టీఆర్ఎస్ ను వీడారు.
వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ తో పాటు జగన్, షర్మిల, వైవీ సుబ్బారెడ్డి లాంటి వాళ్లతో కూడ రాఘవరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి.
వైఎస్ఆర్సీపీలోనే ఆయన కొనసాగుతున్నారు. తెలంగాణలో ఆ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. దీంతో ఆయన రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు.
తెలంగాణలో రాజకీయపార్టీ ఏర్పాటు కోసం షర్మిల సన్నాహలు చేసుకొంటున్నారు. ఈ విషయాల్లో కొండా రాఘవరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు.
చేవేళ్లనే మార్చి మాసంలో షర్మిల పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ ఏర్పాట్లలో రాఘవరెడ్డి తలమునకలై ఉన్నారు.