ప్రకృతి ఒడిలో ఆకట్టుకునే కేటీఆర్ చిత్రం...నల్గొండ యువకుడి అద్భుత ప్రతిభ
నల్గొండ జిల్లాలో బండరాళ్లపై వేసిన కేటీఆర్ పెయింటింగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
నల్గొండ: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చిత్రాన్ని బండరాళ్లను అద్భుతంగా చిత్రీకరించి తన ప్రతిభను చాటుకున్నాడు నల్గొండ జిల్లా చండూరు చెందిన వనం రాజు. తమ నాయకుడి చిత్రాన్ని ప్రకృతి ఒడిలో అత్యంత ఆకర్షణీయంగా చిత్రీకరించిన అతడిపై టీఆర్ఎస్ నాయకులు ప్రశంసిస్తుంటే... అతడి ప్రతిభను చూసి సామాన్య ప్రజానికం కూడా అభినందిస్తున్నారు.
అయితే అతడు బండరాళ్లపై వేసిన కేటీఆర్ పెయింటింగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో ఆ చిత్రాలు ఏకంగా కేటీఆర్ వరకు వెళ్లాయి. అతడి ఎంతో అద్భుతంగా, సహజత్వం ఉట్టిపడేలా ప్రకృతి సోయగాల మధ్యలో గీసిన తన చిత్రాన్ని చూసి మంత్రి కేటీఆర్ కూడా ముగ్దుడయినట్లు తెలుస్తోంది.
దీంతో కేటీఆర్ కార్యాలయం నుండి రాజుకు పిలుపు అందింది. ఇవాళ రాజుకు ఫోన్ చేసిన అధికారులు కేటీఆర్ ను కలవడానికి హైదరాబాద్ కు రావాల్సిందిగా సూచించారట. దీంతో అతడి ప్రతిభకు తగిన అవకాశం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంత డబ్బులతో ఎంతో కష్టపడినందుకు రాజుకు తగిన ఫలితం దక్కనుంది.