సైకిలెక్కిన పువ్వాడ అజయ్ కుమార్... ఖమ్మం అభివృద్ధి కోసం
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు పరిశీలించేందుకు బుధవారం నడుం బిగించారు.
ఖమ్మం: రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు పరిశీలించేందుకు బుధవారం నడుం బిగించారు. అనుకున్నదే తడవుగా ఖమ్మం నగరంలో పర్యటన మొదలెట్టారు. అయితే కార్లు, కాన్వాయ్ తో కాకుండా సామాన్యుడిలా సైకిలెక్కి నగరం మొత్తాన్ని చుట్టేశారు.
ఖమ్మం నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతితో కలిసి మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ అభివృద్ధి పనులు ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.
ఇలా మంత్రి సైకిల్ పైనే నగరంలోని జడ్పీ సెంటర్, తుమ్మలగడ్డ, బోనకల్ క్రాస్ రోడ్, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, జహీర్ పురా, శ్రీనివాస్ నగర్, కిన్నెరసాని థియేటర్ రోడ్, హర్కర్ బావి సెంటర్, పీఎస్ఆర్ రోడ్, గుంటి మల్లన్న దేవాలయం రోడ్, కాల్వఒడ్డు, జూబ్లీపురా, మయూరి సెంటర్, బస్ డిపో రోడ్, సరితా క్లినిక్ సెంటర్, గట్టయ్య సెంటర్, నూతన మున్సిపల్ భవనం వరకు రోడ్డు కు ఇరు వైపులా జరుగుతున్న సైడు కాల్వ పనులు, రోడ్డు విస్తరణ పనులు, విద్యుత్ స్తంభాలు, మిషన్ భగీరథ అంతర్గత పైప్ లైన్ పనులు, పారిశుధ్యం పనులను పరిశీలించారు.
పనుల అలస్యం పట్ల మంత్రి అధికారులపై నిలదీశారు. నెలల తరబడి పనులు కొనసాగింపు కుదరదని పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రజా రవాణాకు, ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా పనుకు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలన్నారు.
మంత్రి పర్యటన నేపథ్యంలో మున్సిపల్, విద్యుత్, పబ్లిక్ హెల్త్, రెవిన్యూ తదితర శాఖ అధికారులు కూడా ఆయన వెంటే ఉన్నారు.