- Home
- Telangana
- Presidential election: రాష్ట్రపతి ఎన్నిక వ్యూహంపై విపక్ష నేతలతో రేపు దీదీ మీటింగ్.. సీఎం కేసీఆర్ డుమ్మా.. ?
Presidential election: రాష్ట్రపతి ఎన్నిక వ్యూహంపై విపక్ష నేతలతో రేపు దీదీ మీటింగ్.. సీఎం కేసీఆర్ డుమ్మా.. ?
రేపు మమతా బెనర్జీ నిర్వహించ తలపెట్టిన విపక్షాల మీటింగ్ కు సీఎం కేసీఆర్ హాజరు అయ్యే అవకాశం కనిపించడం లేదు. జాతీయ పార్టీ ఏర్పాటులో బిజీగా ఉండటం, జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు, ఇతర కారణాల వల్ల సీఎం దీనికి హాజరుకాలేకపోతున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు జూన్ 15న (రేపు) ఢిల్లీలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. అయితే దీనికి సీఎం హాజరు అయ్యే సూచనలు కనిపించడం లేదు. తనకు బదులుగా పార్టీ సీనియర్ నాయకుడిని సభకు పంపించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
విపక్ష పార్టీలతో జూన్ 15వ తేదీన జరిగే సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరుకావడంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, మరి కొందరు సీఎంలు కూడా ఇలాగే తమ పార్టీల నుంచి ఈ సమావేశానికి ఇతర నాయకులను పంపించనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. అలాగే టీఆర్ఎస్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ తో పాటు టీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకులు కె.కేశవరావు లేదా నామా నాగేశ్వరరావులను పేర్లను ఈ సమావేశం కోసం కేసీఆర్ పరిశీలిస్తున్నారు.
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై సంప్రదింపులతో బిజీగా ఉన్నారు. రోజూ కొందరు నేతలను కలుస్తున్నారు. మరి కొందరు నేతలతో ఫోన్లో మాట్లాడుతున్నారు. చాలా మంది సీఎంలు తమ సొంత కారణాలతో ఈ సమావేశానికి దూరంగా ఉండటం, చాలా పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థిపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం వంటి అంశాలను సీఎం కేసీఆర్ నిశితంగా గమనిస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రపతి ఎన్నికలతో పాటు ప్రతిపక్ష పార్టీలపై కేంద్రం సీబీఐ, ఈడీ, ఐటీ ఏజెన్సీలను ఎలా దుర్వినియోగం చేస్తోందనే దానిపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కేసీఆర్ మే చివరి వారంలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడను కలిశారు. అయితే జాతీయ పార్టీని స్థాపించాలని నిర్ణయించుకున్న తర్వాత ఆయన పశ్చిమ బెంగాల్, బీహార్ పర్యటనలను రద్దు చేసుకున్నారు.
కాగా.. జాతీయ పార్టీ ప్రకటన అనంతరం మేధావులు, సంస్థాగత నేతలతో భేటీ అయ్యేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్లే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన పర్యటన సందర్భంగా ఢిల్లీలో ప్రెస్ మీట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది.