మా అన్న కూడ బీజేపీలోకే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనం
తనతో పాటు తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడ బీజేపీలో చేరుతారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు బీజేపీలో చేరుతారని ఆయన జోస్యం చెప్పారు.
శుక్రవారం నాడు అసెంబ్లీ ఆవరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. తన లాంటి వాడు బీజేపీలో చేరితేనే ఆ పార్టీ బలపడుతుందన్నారు. తాను బీజేపీలో చేరినా కూడ ఎమ్మెల్యేల పదవికి రాజీనామా చేయనని ఆయన స్పష్టం చేశారు.
టైటానిక్ ఓడలో తన లాంటి హీరో ఉన్న కూడ మునిగిపోవాల్సిందేనని ఆయన కాంగ్రెస్ పార్టీపై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గడువు అయిపోయిన మందు లాంటిందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను బీజేపీలో చేరిన తర్వాత తన వెనుకే చాలా మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. దేశాభివృద్ది బీజేపీతోనే సాధ్యమన్నారు.
తాను బీజేపీలో చేరగానే యువత బీజేపీలో చేరనుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లేకుండానే తాను బీజేపీలో చేరుతానని ఆయన ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీతో పాటు సోనియా, రాహుల్ గాంధీలు అంటే తనకు గౌరవమని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఓ కార్యకర్తకు భరోసాను కల్పించేందుకు తాను మాట్లాడిన మాటలను హైలెట్ చేశారని ఆయన చెప్పారు. కానీ, ప్రస్తుతం ఆ కార్యకర్త టీఆర్ఎస్ లో చేరాడని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తన వెంటే కార్యకర్తలు వస్తారని ఆయన తెలిపారు.
తన కంటే సీనియర్లు బీజేపీలో చాలా మంది ఉన్నారని ఆయన చెప్పారు. సామాన్య కార్యకర్తగా పార్టీ బలోపేతం కోసం తాను కృషి చేస్తానన్నారు. 20 ఏళ్ల వరకు బీజేపీనే అధికారంలో ఉంటుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికల్లో తెలంగాణలో కూడ బీజేపీ అధికారంలోకి వస్తోందన్నారు.
పీసీసీ చీఫ్ పదవిని తానే వదులుకొన్నట్టుగా రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పదవికి ప్రస్తుతం రేవంత్ రెడ్డి పేరు విన్పిస్తుందన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరుతున్నారనే ప్రచారంతో టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకొన్నట్టుగా ఉందనిపిస్తోందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తాను ప్రతి నెల చిరుమర్తి లింగయ్యకు రూ. 50వేలు ఇచ్చేవాడినని ఆయన గుర్తు చేశారు.