ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై తేల్చేసిన కోదండరామ్: కాంగ్రెస్ ఏం చేస్తోంది?
నల్గొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి పోటీ చేయాలని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయాన్ని టీజేఎస్ ఇవాళ అధికారికంగా ప్రకటించింది.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టుగా టీజేఎస్ తేల్చి చెప్పింది. టీజేఎస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి కోదండరామ్ బరిలోకి దిగుతున్నట్టుగా ఆ పార్టీ సోమవారం నాడు ప్రకటించింది. అయితే టీజేఎస్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోందా... స్వంతంగా అభ్యర్ధిని బరిలో దింపుతోందా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
వచ్చే ఏడాదిలో నల్గొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు, హైద్రాబాద్,రంగారెడ్డి, మహాబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి.
ఈ రెండు స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు కూడ ఈ రెండు స్థానాల్లో తమ సత్తాను చాటాలని ప్రయత్నాలను ప్రారంభించాయి.నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో టీజేఎస్ అభ్యర్ధిగా కోదండరామ్ పోటీ చేయనున్నారు.
ఈ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీని ఇదివరకే టీజేఎస్ కోరింది. అయితే టీజేఎస్ కు మద్దతివ్వడం కంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణికం ఠాగూర్ తో సమావేశమైన ఈ మూడు జిల్లాలకు చెందిన నేతలు టీజేఎస్ కు మద్దతివ్వకుండా కాంగ్రెస్ అభ్యర్ధిని బరిలోకి దింపాలని కోరారు.
టీజేఎస్ కు మద్దతిచ్చే విషయమై కాంగ్రెస్ పార్టీ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ సబ్ కమిటీ సిఫారసు మేరకు కాంగ్రెస్ పార్టీ ఈ విషయమై నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు ఆరుగురు నేతలు ఈ స్థానం నుండి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ఈ విషయమై తమకు టిక్కెట్టు ఇవ్వాలని కోరుతూ పార్టీ నాయకత్వానికి ధరఖాస్తు చేసుకొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిక్కెట్టు ఆశిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగా ఉండడంతో నేతల జాబితాను షార్ట్ లిస్ట్ చేయాలని మాణికం ఠాగూర్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదేశించిన విషయం తెలిసిందే.