సీఎం కేసీఆర్ మనవడి పెద్ద మనసు.. రూ. కోటితో కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాల..
ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు పెద్ద మనస్సు చాటుకున్నారు. ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దాదాపు రూ. కోటి ఖర్చు చేసి కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు పెద్ద మనస్సు చాటుకున్నారు. ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దాదాపు రూ. కోటి ఖర్చు చేసి కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దారు.
వివరాలు.. హిమాన్షు ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివేటప్పుడు అదే ఏరియాలోని కేశవనగర్లో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడేవారు. ఆ సమయంలో స్కూల్ పరిసరాల్లోని పరిస్థితిని చూసి హిమాన్షు చలించిపోయారు. పాఠశాలను అభివృద్ది చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ క్రియేటివ్ యాక్షన్ సర్వీసెస్ (సీఏఎస్) అధ్యక్షుడిగా ఉన్న హిమాన్షు.. తన పాఠశాలలో నిధులు సేకరించారు. ఆ నిధులతో హిమాన్షు కేశవనగర్లో ఉన్న ప్రాథమిక పాఠశాల అభివృద్ది పనులు చేపట్టారు.
ఇప్పుడు ఆ అభివృద్ది పనులు పూర్తి కాగా.. అందుకు సంబంధించిన ఫొటోలను హిమాన్షు తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. ఇక, హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ పాఠశాలను ప్రారంభించనున్నారు.
‘‘నేను సీఏఎస్ అధ్యక్షునిగా నా పాఠశాలలో సేకరించిన నిధులతో ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పునరుద్ధరించాను. దీనిని మన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూలై 12న ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ వెనుక కథను త్వరలో పంచుకుంటాను’’ అని హిమాన్షు ట్వీట్ చేశారు.
హిమాన్షు సమకూర్చిన నిధులతో విద్యార్థులకు బెంచీలు, మరుగుదొడ్ల నిర్మాణం, డైనింగ్ గది, ఆట స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు కేశవనగర్లోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు యాదవ్ వివరించారు. పాఠశాల అభివృద్ధి కోసం సుమారు రూ.80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేసి అత్యాధునికంగా తీర్చిదిద్దారని రాములు యాదవ్ తెలిపారు.