పోరాటం తెలంగాణ ప్రజల రక్తంలోనే ఉంది.. పవన్ కల్యాణ్..
సమస్యల పరిష్కారంలో జనసేన పాత్ర క్రియాశీలకం కావాలని తెలంగాణ యువజన, విద్యార్థి విభాగాలకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సూచించారు.
సమస్యల పరిష్కారంలో జనసేన పాత్ర క్రియాశీలకం కావాలని తెలంగాణ యువజన, విద్యార్థి విభాగాలకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సూచించారు.
ధైర్యంగా గళమెత్తి పోరాటం చేయడం అనేది తెలంగాణ ప్రజల్లో ఉందని, అందుకే మన చుట్టూ ఉన్న సమస్యలపై ప్రభావశీలంగా మాట్లాడాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు. యువకులు, విద్యార్థులు రాజకీయ చైతన్యంతో ముందుకు వెళ్ళి ప్రజలకు అండగా ఉండాలి అన్నారు.
జనసేన పార్టీ తెలంగాణ విభాగం ఇటీవల నియమించిన విద్యార్థి, యువజన కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులతో పవన్ కల్యాణ్ మంగళవారం మాట్లాడారు.
ఈ సందర్భంగా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ వి.వి.రామారావు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు టి.సంపత్ నాయక్, యువజన విభాగం అధ్యక్షుడు వి.లక్ష్మణ్ గౌడ్ ఈ కమిటీల సభ్యులకు, సాంస్కృతిక విభాగం కార్యదర్శి దుంపటి శ్రీనివాస్ కు నియామక పత్రాలు అందించారు.
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “మన చుట్టూ ఉన్న ప్రజల కోసం బలంగా నిలబడి గొంతు వినిపించండి. ఆ ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా పని చేయాలి.
సమస్యల పరిష్కారంలో జనసేన పార్టీ తరఫున అందరం క్రియాశీలకంగా వ్యవహరించాలి.
మీ వెన్నంటి నేను ఉంటాను.
ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో కావచ్చు... కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో కావచ్చు... పాలమూరు రైతులు, కూలీల ఇబ్బందులు కావచ్చు... ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా స్పందిద్దాం.
మన వంతుగా మనం అండనిచ్చి నిలబడదాం. ఎప్పటికప్పుడు కమిటీలతో సమావేశం అయి చర్చిద్దాం” అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంచార్జ్ ఎన్.శంకర్ గౌడ్, ముఖ్య నాయకులు రామ్ తాళ్ళూరి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఆర్.రాజలింగం పాల్గొన్నారు.