హుజూర్నగర్లో సీపీఐ మద్దతు కోరిన టీఆర్ఎస్: మారుతున్న సమీకరణాలు
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. సీపీఐ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందో అనే ఆసక్తి సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం కోసం అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి.ఈ ఎన్నికల్లో సీపీఐ మద్దతును టీఆర్ఎస్ కోరింది.
తమకు సీపీఐ మద్దతిచ్చేందుకు దాదాపుగా సానుకూలంగా సంకేతాలు ఇచ్చిందని టీఆర్ఎస్ నేతలు ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఎల్లుండి జరిగే సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో టీఆర్ఎస్ అభ్యర్ధికి మద్దతిచ్చే విషయమై ప్రకటన చేయనున్నట్టుగా సీపీఐ తేల్చి చెప్పింది.
గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, టీడీపీ,తెలంగాణ జనసమితి, కాంగ్రెస్ లు కలిసి ప్రజా కూటమిగా పోటీ చేశాయి. అయితే హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు సీపీఐను కోరారు.
ఆదివారం నాడు సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో టీఆర్ఎష్ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ లు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.
అయితే ఎల్లుండి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉన్నందున ఆ సమావేశంలో నిర్ణయం తీసుకొంటామని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన పద్దతిపై సీపీఐ నాయకత్వం కొంత అసంతృప్తితో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడ కాంగ్రెస్ ఇదే రకమైన వైఖరిని అవలంభించిందనే అభిప్రాయం సీపీఐ నేతల్లో ఉంది.
కొత్తగూడెం, హుజూరాబాద్ వంటి కీలక నియోజకవర్గాల విషయంలో కూడ కాంగ్రెస్ అనుసరించిన తీరుతో సీపీఐ తీవ్ర అసంతృప్తితో ఉంది. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో సీపీఐ మద్దతు కోరుతూ టీఆర్ఎస్రావడంపై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీపీఐ నాయకత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో సీపీఎం పోటీ చేస్తోంది. గతంలో కూడ ఈ స్తానంలో ఆ పార్టీ పోటీ చేసింది.ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుండి సీపీఎఎం, భువనగిరి నుండి సీపీఐ పోటీ చేసింది. హుజూర్నగర్ అసెంబ్లీ స్థానంలో తమకు మద్దతు ఇవ్వాలని సీపీఐను సీపీఎం కోరింది.
సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు సెప్టెంబర్ 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణ జనసమితి, టీడీపీ నేతలతో కూడ సీపీఎం నేతలు చర్చించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మాత్రం తమ అభ్యర్ధిని బరిలో దింపుతున్నట్టుగా సీపీఎం నేతలకు తేల్చి చెప్పారు.
సీపీఐ నేతలతో టీఆర్ఎస్ నేతలు భేటీ కావడం ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇస్తోందా లేక ఇతర పార్టీలకు మద్దతును ప్రకటించనుందా అనేది రెండు రోజుల్లో తేలనుంది.
కమ్యూనిష్టులపై సీఎం కేసీఆర్ గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం నాడు గుర్తు చేశారు.ఓటమి భయంతోనే కేసీఆర్ సీపీఐ మద్దతును కోరుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు.
సీపీఐ టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటిస్తే రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే హుజూర్నగర్ నుండి సీపీఎం తన అభ్యర్ధిగా పారేపల్లి శేఖర్ రావును బరిలోకి దింపింది. టీడీపీ అభ్యర్ధిగా చావా కిరణ్మయిని ఆ పార్టీ పోటీకి దింపనుంది.
సీపీఎం, టీడీపీ అభ్యర్ధులు సోమవారం నాడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. ఈ దఫా టీడీపీ పోటీ చేయడం కాంగ్రెస్ కు నష్టమేననే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.