హుజురాబాద్ ఉపఎన్నిక ఎఫెక్ట్... కలెక్టర్ శశాంక బదిలీ, కర్ణన్ కు బాధ్యతలు
సోమవారం రాత్రి బదిలీ ఆదేశాలు వెలువడగా ఇవాళ(మంగళవారం) కర్ణన్ కరీంనగర్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్ శశాంకను ఆ భాధ్యతల నుండి తప్పించి ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ కు ఆ బాధ్యతలు అప్పగించింది. శశాంకను జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
సోమవారం రాత్రి బదిలీ ఆదేశాలు వెలువడగా ఇవాళ(మంగళవారం) కర్ణన్ కరీంనగర్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాల గూర్చి నూతన కలెక్టర్ కు జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య వివరించారు. ఈ క్రమంలో పెండింగ్ లో వున్న వైకుంఠధామాల నిర్మాణ బాధ్యతలు డిప్యూటి ఇంజనీర్లకి అప్పగించాలని ఆదేశించారు. పెండింగ్ పనులు పూర్తి అయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో కరోనా పరిస్థితుల గురించి కలెక్టర్ ఆరా తీశారు. జ్వర సర్వేని వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి తగిన చికిత్స అందించాలని సూచించారు.
తెలంగాణలో ముగ్గురు కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఖమ్మం కలెక్టర్గా ఉన్న ఆర్వీ కర్ణన్ను కరీంనగర్కు, మహబూబాబాద్ కలెక్టర్గా పనిచేస్తున్న వీపీ గౌతమ్ను ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. మహబూబాబాద్ అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్కు కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.