అదొక్కటే ఈ ప్రాణాంతక వ్యాధులన్నింటికి విరుగుడు: జగదీష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో హరితహారం6 కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.
సూర్యాపేట: చెట్ల పెంపకం ప్రాధాన్యతను మొదట గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే హరితహారం పేరుతో గడిచిన ఆరు ఏండ్లుగా చైతన్యం తీసుకొచ్చి మొక్కల పెంపకంలో పోటీపడేలా చేసిన ఘనత ముమ్మాటికి కేసీఆర్ దే అని అన్నారు.
ఆరవవిడత హరితహారం కార్యక్రమంలో బాగంగా గురువారం ఉదయం సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలోని 9 వ వార్డులో ఏకకాలంలో 1050 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పర్యావరణ సమస్య ప్రపంచానికి సవాల్ విసురుతున్న నేపధ్యంలో అడవుల పెంపకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి సత్ఫలితాలు సాదించిందన్నారు.
మొదటి విడత హరితహారంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మొక్కలునాటి ప్రారంభించిన హరితహారం తోటే ఇప్పుడు ఆ జాతీయ రహదారిపై హరితశోభ వర్ధిల్లుతోందని చెప్పారు. పర్యావరణ సమస్యను అధిగమించాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని అందుకు అనుగుణంగా టార్గెట్లు పెట్టుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా కొనసాగిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.
మానవ జాతి ఎదుర్కొంటున్న అతి పెద్దసమస్యల్లో పర్యావరణం అతి ముఖ్యమైనదన్నారు. వాతావరణం లో మార్పులు జరిగి వాయు కాలుష్యంతో ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలడం కూడా అందులో ఒక బాగమేనని ఆయన చెప్పారు. వాటన్నింటికి కారణం వర్షాలు పడక పోవడమేనని... ఇందుకు అడవులు అంతరించి పోవడమే కారణమన్నారు. అటువంటి అడవుల పెంపకంపై దృష్టి సారించి మొక్కలపెంపకం ఒక ఉద్యమంలా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. దానికి కొనసాగింపుగానే జిల్లాలో 83 లక్షల మొక్కలు నాటడం టార్గెట్ గా పెట్టుకుని హరితహారం ప్రారంభించుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, హుజుర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, యస్ పి భాస్కరన్,డి ఆర్ ఓ మోహన్ రావు,డి ఆర్ డి ఏ పి డి కిరణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.