జీహెచ్ఎంసీ ఎన్నికల ఎఫెక్ట్: పవన్ కల్యాణ్ "తిరుపతి" చిచ్చు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పొత్తుకు నిరాకరించిన ప్రభావం తిరుపతి లోకసభ సీటుకు జరిగే ఉప ఎన్నికపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తిరుపతి సీటును తమకు కేటాయించాలని ఇప్పటికే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పట్టుబడుతున్నారు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పొత్తుకు నిరాకరించిన ప్రభావం తిరుపతి లోకసభ సీటుకు జరిగే ఉప ఎన్నికపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తిరుపతి సీటును తమకు కేటాయించాలని ఇప్పటికే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పట్టుబడుతున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ జనసేన పార్టీతో బిజెపి పొత్తుకు దూరం కావడంతో తిరుపతిపై ఆయన పట్టు బిగించే అవకాశం ఉంది
నిజానికి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కల్యాణ్ ఆసక్తి ప్రదర్శించినట్లు అర్థమవుతోంది. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పవన్ కల్యాణ్ తో సమావేశమవుతారని జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. బిజెపి నుంచి ఏ విధమైన సంకేతాలు రాకుండానే జనసేన ఆ ప్రకటన విడుదల చేసిందా సందేహం తలెత్తుతోంది
పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరున ఆ ప్రకటన విడుదలైంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని జనసేన, భారతీయ జనతా పార్టీలు నిర్ణయించాయని, ఇందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ అగ్ర నేతలు కలవనున్నారని ఆయన ఆ ప్రకటనలో అన్నారు. అంతేకాకుండా ఈ నిర్ణయంతో ఇరు పార్టీల కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కూడా ఆయన అన్నారు.
ప్రకటన తీరు చూస్తుంటే, ఇరు పార్టీల మధ్య సమాచార వినిమయం జరిగిన తర్వాతనే హరిప్రసాద్ పేర ఆ ప్రకటన విడుదలైనట్లు అర్థమవుతోంది. అంతేకాకుండా పవన్ కల్యాణ్ కు తెలియకుండా హరిప్రసాద్ ఆ ప్రకటన విడుదల చేస్తారని కూడా అనుకోవడానికి లేదు. ఈ స్థితిలో ఒక్కసారిగా బండి సంజయ్ మీడియా సమావేశంలో జనసేనతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు.
జనసేనతో పొత్తు ప్రతిపాదన లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. పైగా, జనసేనకు, బిజెపికి మధ్య చిచ్చు పెట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తాను ఇప్పుడే పవన్ కల్యాణ్ తో భేటీ అవుతానని కూడా చెప్పలేదు. నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ తో భేటీ అవుతానని ఆయన చెప్పారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని పవన్ కల్యాణ్ ను కోరుతామని కూడా చెప్పారు. బండి సంజయ్ మాటలను బట్టి చూస్తే ఆయన ఏ మాత్రం జనసేనతో పొత్తుకు సిద్ధంగా లేనట్లు అర్థమవుతూనే ఉంది
బిజెపి తీరుతో పవన్ కల్యాణ్ మనసు నొచ్చుకునే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై ఆయన బయటపడుతారా, లేదా అనేది చెప్పలేం. బిజెపితో పొత్తును తెగదెంపులు చేసుకుంటారని కూడా అనుకోవడానికి లేదు. అయితే, తిరుపతి ఉప ఎన్నికలో మాత్రం తాము పోటీ చేస్తామనే పట్టును మరింత బిగించే అవకాశం ఉంది. జాతీయ నాయకులతోనూ కేంద్రం పెద్దలతోనూ తనకున్న సత్సంబంధాలను ఆయన వినియోగించుకునే అవకాశం ఉంది
తిరుపతి ఉప ఎన్నికపై వివిధ పార్టీలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఖరారు చేశారు. తాజాగా గురువారంనాడు తిరుపతి ఉప ఎన్నికలపై వైసీపీ అధినేత, ఎపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కసరత్తు ప్రారంభించారు. పార్టీ ముఖ్య నేతలతో, మంత్రులతో, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం నిర్వహించారు
అదలావుంటే, బిజెపి తిరుపతి నుంచి మాజీ మంత్రి రావెల కిశోర్ బాబును పోటీకి దించాలని ఆలోచిస్తోంది. అయితే, ఆయనకు మద్దతు ఇవ్వడానికి జనసేన సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. తిరుపతి సీటును తమకు ఇవ్వాలని జనసేన డిమాండ్ చేస్తోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తును నిరాకరించిన నేపథ్యంలో తిరుపతిపై పవన్ కల్యాణ్ మరింత పట్టు బిగించే అవకాశం ఉంది.