కవిత ఓటమి ఎఫెక్ట్: కేసీఆర్పై సురేష్ రెడ్డి అసంతృప్తి
మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి టీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీని అమలు చేయలేదని సురేష్ రెడ్డి వర్గం అసంతృప్తితో ఉంది.
నిజామాబాద్ జిల్లాలో సురేష్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరడం ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి తీరని షాక్. అయితే ఆ సమయంలో కీలకమైన పదవిని కట్టబెడతామని టీఆర్ఎస్ నాయకత్వం సురేష్ రెడ్డికి హామీ ఇచ్చిందని సమాచారం.
నిజామాబాద్ ఎంపీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కేసీఆర్ కూతురు కవిత ఓటమి పాలయ్యారు. ఈ స్థానంలో అనుహ్యంగా బీజేపీ అభ్యర్ధి టీఆర్ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ విజయం సాధించారు.
ఈ పరిణామం టీఆర్ఎస్ వర్గాలను షాక్ కు గురిచేసింది. కవిత ఎంపీగా విజయం సాధిస్తే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డిలకు మంచి పదవులు దక్కేవనే ప్రచారంలో ఉంది. అయితే కవిత ఓటమి కావడంతో వీరిద్దరూ కూడ రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారని ప్రచారం సాగుతోంది.
డిఎస్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ సలహదారు పదవిని ఇస్తామని సురేష్ రెడ్డికి హమీ ఇచ్చారని చెబుతున్నారు.అయితే ఆ పదవి దక్కలేదు. మరో వైపు డీఎస్ పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ వైపు డీఎస్ చూస్తున్నారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఆయనపై వేటు పడితే రాజ్యసభ సభ్యత్వాన్ని డీఎస్ కోల్పోయే అవకాశం ఉంది.
అయితే డీఎస్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. తనపై టీఆర్ఎస్ నాయకత్వం చర్యలు తీసుకోవాలని డీఎస్ చూస్తున్నారు. టీఆర్ఎస్ మాత్రం డిఎస్ పై చర్యలు తీసుకోవడం లేదు. డిఎస్ పై చర్యలు తీసుకొంటే రాజకీయంగా డిఎస్ నెత్తిన పాలు పోసినట్టే. దీంతో ఈ విషయం ఇప్పట్లో తేలేలా లేదు
ఎంపీ పదవి కూడ తేలేలా లేదని కెఆర్ సురేష్ రెడ్డి వర్గీయులు మదనపడుతున్నారు. కీలకమైన పదవి ఇస్తామని చెప్పిన నాయకత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని సురేష్ రెడ్డి వర్గీయులు పార్టీ మారాలని ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
బీజేపీ నేతలు కూడ సురేష్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు. అయితే కొంత కాలం పాటు వేచి చూసే ధోరణితో వ్యవహరించాలని సురేష్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం.