కలిసికట్టుగా పోరాటం చేస్తే విజయం: మాణికం ఠాగూర్కి కాంగ్రెస్ నేతల ఘనస్వాగతం
కుంతియా స్థానంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జీగా మాణికం ఠాగూర్ ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. పార్టీని విజయపథంలో నడిపించేందుకు ఠాగూర్ ఇప్పటి నుండే ప్రయత్నాలను ప్రారంభించారు.
కలిసి కట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ చెప్పారు.
కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీగా నియామకమైన తర్వాత ఠాగూర్ శనివారం నాడు ఆయన తొలిసారిగా హైద్రాబాద్ కు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఓపెన్ టాప్ జీపులో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనను గాంధీభవన్ కు తీసుకొచ్చారు.
పార్టీ ఇంఛార్జీగా నియామకమైన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పార్టీ నేతలతో కోర్ కమిటీ సమావేశంలో చర్చించారు.ఈ సమావేశం తర్వాత ఆయన నేరుగా నిన్న హైద్రాబాద్ కు వచ్చారు.
పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ప్రతి నెలలో రెండుసార్లు తప్పకుండా కోర్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
కోర్ కమిటీ సమావేశాల్లో అన్ని విషయాలను చర్చిస్తామన్నారు. పార్టీ అంశాలపై ఎప్పుడైనా చర్చించేందుకు తాను సిద్దంగా ఉంటానని ఆయన ప్రకటించారు.ప్రజలెదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పార్టీ నేతలు ఎప్పుడు పనిచేయాలని ఆయన కోరారు.
వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ ఎఐసీసీ ఇచ్చిన ఆందోళన కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన సూచించారు.ఈ నెల 28వ తేదీన గవర్నర్ కు వినతిపత్రాలు ఇవ్వాలని ఆయన కోరారు. అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్, మజ్దూర్ బచావో దినంగా పాటించాలని ఆయన కోరారు.
అక్టోబర్ 2 నుండి 31 వరకు రైతులు, వ్యవసాయకార్మికులతో సంతకాలను సేకరించాలని ఆయన పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయినుండి పార్టీ నేతలంతా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కోరారు.
ఇతర బిల్లులకు మద్దతిచ్చిన కేసీఆర్.. వ్యవసాయ బిల్లుల విషయంలో వ్యతిరేకించడాన్ని ఆయన తప్పుబట్టారు. రైతుల పక్షాన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని ఆయన సూచించారు.