మంత్రులకు కేసీఆర్ హెచ్చరిక: దాని వెనుక ఆంతర్యం ఇదే...
మునిసిపల్ ఎన్నికలకు హై కోర్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక కేవలం మునిసిపాలిటీలు రేజర్వేషన్లు ప్రకటించడమే తరువాయి. ఇంకో నాలుగు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవనుంది.
తెలంగాణాలో మరోమారు ఎన్నికలవేడి ముంచుకొస్తుంది. మునిసిపల్ ఎన్నికలకు హై కోర్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక కేవలం మునిసిపాలిటీలు రేజర్వేషన్లు ప్రకటించడమే తరువాయి. ఇంకో నాలుగు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవనుంది.
నేడు కెసిఆర్ నిర్వహించిన తెరాస సమావేశంలో కెసిఆర్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు హెచ్చరికలు జారీ చేసాడు. ఒక్కో మంత్రికి కొన్ని మునిసిపాలిటీల చొప్పున ఇప్పటికే అప్పగించారు. ఒక్కో మంత్రి పరిధిలోకి వచ్చే ఏ ఒక్క మున్సిపాలిటీ ఓడిపోయినా...వారి మంత్రి పదవులు ఇక ఉండవని హెచ్చరించారు ముఖ్యమంత్రి కెసిఆర్.
అక్కడితో ఆగకుండా రెబెల్స్ అనే మాటనే సహించేది లేదని అందరికీ తెగేసి చెప్పారు. అసలు ఉన్నట్టుండీఫై కెసిఆర్ ఇంతలా ఎందుకు ఇంత అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు? ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ను ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అంతే కాకుండా కొన్ని రోజులకింద మునిసిపల్ ఎన్నికల సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించిన కేటీఆర్ కూడా ఇలా అర్థం ధ్వనించే విధంగానే మాట్లాడారు. ఈ నెలలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎక్కువ మంది పోటీ పడుతున్నారని కేటీఆర్ చెప్పారు
రెబెల్ అభ్యర్ధులు బరిలో ఉంటే పార్టీకి నష్టమన్నారు. రెబెల్ అభ్యర్ధులను కాళ్లు పట్టుకొనో, కడుపులో తలపెట్టో పోటీ నుండి నివారించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు
ఈ అన్ని వ్యాఖ్యల వెనకున్న కారణం ఒక్కటే. బీజేపీ. మొన్న కొన్ని రోజుల కింద హైదరాబాద్ నగరంలోని ఒక హోటల్ లో మీడియా దృష్టికి దూరంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
వారు సమావేశమై ఏం మాట్లాడారనేది ప్రత్యేకించి చెప్పనప్పటికీ మునిసిపల్ ఎన్నికల్లో తెరాస నుంచి టిక్కెట్లఆశించి భంగపడ్డవారికి బీజేపీ టిక్కెట్లిచ్చి బరిలోకి దింపాలని వీరు ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బీజేపీ అధినాయకత్వం కూడా సంస్థాగత నిర్మాణానికి అది ఎంతో ఉపయుక్తకరంగా ఉందని నమ్ముతున్నట్టు సమాచారం.
సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో బీజేపీ నేతలంతా ఆరెస్సెస్ నుంచో లేదా ఇతర బీజేపీ అనుబంధ సంస్థ నుంచో పైకి ఎదుగుతూ వస్తారు. కాకపోతే తెలంగాణాలో బీజేపీకి సొంత ఇంటి నుంచి లీడర్ల కొదవ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అందుకోసమని ఇతర పార్టీల నేతలను చేర్చుకునే పనిలో ఇప్పటికే నిమగ్నమయ్యారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి వంటివారంతా ఈ కోవలోని వారే.
ఇప్పుడు రానున్న మునిసిపల్ ఎన్నికల్లో పౌరసత్వ చట్టాన్ని ఉపయోగించి తెరాస ను హిందూ వ్యతిరేక పార్టీగా చూపెట్టి లాభపడాలని బీజేపీ భావిస్తోంది. పౌరసత్వ బిల్లుకు తెరాస వ్యతిరేకంగా ఓటు వేయడం, ఒవైసీతో కెసిఆర్ జుగల్ బందీని బయటకు చూపెడుతూ హిందూ అస్తిత్వవాద రాజకీయాలకు తెరతీయాలని బీజేపీ భావిస్తోంది.
అందుకోసం ఇప్పటికే బీజేపీ తన అస్త్రాలను ప్రయోగించడం ఆరంభించింది. కొన్ని రోజులకిందటినుండే బీజేపీ అసదుద్దీన్ ఓవైసీపై తమ ఆరోపణల్లో వాడిని పెంచింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఒవైసి పచ్చ జెండా ఇక ఎగరదు, ఎగిరేది కాషాయ జెండానే అని వార్నింగ్ ఇచ్చాడు.
నిన్న మరో బీజేపీ యువ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏమో నిజామాబాదులో ఒవైసీని క్రేనుకు ఉరితీస్తానని అన్నాడు. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ హిందూ ఓట్లను కూడగట్టుకోవడానికి వాటిని కన్సాలిడేట్ చేసే ఎత్తుగడ వేసింది బీజేపీ.
అందుకే కెసిఆర్ అంతలా ఈ విషయం పట్ల సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి రానున్న రోజుల్లో తెరాస లో టిక్కెట్ల కొట్లాట బీజేపీకి ఎమన్నా అవకాశం ఇస్తుందో లేదో...!